విజయవాడ : (AP) విద్యుత్ శాఖలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల కింద 27 మంది అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు మంజూరు చేశారు. ట్రాన్స్కో, జెన్కో సహా విద్యుత్ శాఖలోని పలు సంస్థల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఈ నియామకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నియామక పత్రాలను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ ట్రాన్స్కో, జెన్కోలో ఎప్పటికప్పుడు కారుణ్య నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో అర్హత మేరకు ఇంజినీరింగ్ ఉద్యోగాలు ఒక్కరికీ ఇవ్వలేదని విమర్శించారు. ఉన్నత విద్యార్హత ఉన్నవారికి కూడా ఆఫీసు సబార్డినేట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మాత్రమే ఇచ్చారన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదేశాల మేరకు అభ్యర్థి అర్హతకు తగిన ఉద్యోగాలు ఇస్తున్నామని తెలిపారు.
Read Also: Amaravati : మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం
అర్హతకు తగిన పోస్టులు కల్పిస్తున్న ప్రభుత్వం
అర్హులైనవారికి జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని తెలిపారు. (AP) ఇప్పటి వరకు చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లోని పిల్లలకు 600 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చామని.. కారుణ్య నియామకాల్లో జాప్యం లేకుండా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడు అభ్యర్థుల ఏజ్ రిలాక్షేషన్ విషయంలోనూ సానుకూలంగా స్పందించి కారుణ్య నియామకాలకు పచ్చజెండా ఊపారని మంత్రి గొట్టిపొటి వెల్లడించారు. తద్వారా బాధిత కుటుంబాలకు చెందిన ఓవర్ ఏజ్, అండర్ ఏజ్ వారికి ప్రత్యేక అనుమతులతో ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. భవిష్యత్తులోనూ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం నియామకాలు చేపడుతుందని చెప్పారు. దీనితో బాధితుల కుటుంబాలకు త్వరితగతిన ఊరట లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
విద్యుత్ ఉద్యోగులకు విశాఖలో ప్రత్యేక శిక్షణ
ప్రస్తుత విద్యుత్ శాఖ ఇన్ సర్వీస్ ఉద్యోగులతో పాటు,(AP) కొత్తగా విధుల్లో చేరిన వారికి అవసరమైన శిక్షణను విశాఖపట్నంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రంగా అందిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులందరూ విధుల్లో రెట్టింపు ఉత్సాహంగా పని చేసి విద్యుత్ సంస్థలకు మంచి పేరు తీసుకు రావాలని మంత్రి సూచించారు. సీఎస్ కె. విజయానంద్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తూ ఉద్యోగులు ఎవరైనా చనిపోతే కారుణ్య నియామకాలు చేపడుతున్నామని అన్నారు. ఏడాది లోపు దరఖాస్తు చేసుకోలేకపోయినవారికి కూడా సడలింపులు ఇచ్చి ఉద్యోగాలు కల్పించామని అన్నారు. ఉద్యోగుల భద్రత, యోగక్షేమాలు కల్పించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రమాదాల బారిన పడిన ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఉద్యోగంలో చేరిన అభ్యర్థులంతా తమ స్కిల్ పెంచుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధి సాధించాలని సీఎస్ విజయానంద్ ఆకాంక్షించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: