విశాఖపట్నం ఐటీ రంగంలో మరో కీలక అడుగు పడబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సేవల సంస్థ యాక్సెంచర్(Accenture ) నగరంలో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వస్తోందని అంతర్జాతీయ మీడియా సంస్థ రాయిటర్స్ కథనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, విశాఖపట్నం భౌగోళిక స్థితి, నైపుణ్య వనరులు, ఐటీ వాతావరణం అభివృద్ధికి అనువుగా ఉండటంతో యాక్సెంచర్ ఇక్కడ కార్యకలాపాలు విస్తరించాలని నిర్ణయించుకుందని సమాచారం.
ఆ ప్రతిపాదన ప్రకారం..సంస్థకు పది ఎకరాల భూమిని ఎకరాకు 99 పైసల లీజు చొప్పున కేటాయిస్తే, దాదాపు 12 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని యాక్సెంచర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇది అమలులోకి వస్తే విశాఖపట్నం ఐటీ హబ్గా మరింత బలపడే అవకాశం ఉంది. ఇప్పటికే నగరంలో టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి అంతర్జాతీయ సంస్థలు కార్యకలాపాలు విస్తరించడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో యాక్సెంచర్ రాకతో మరిన్ని అంతర్జాతీయ కంపెనీలు విశాఖపై దృష్టిసారించే అవకాశాలు ఉన్నాయి.
విశాఖపట్నం (Vizag) ఐటీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడితే రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదం అవుతుంది. ముఖ్యంగా యువతకు విస్తృత స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా అనుబంధ పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, సేవారంగాలూ చురుకుగా ముందుకు సాగుతాయి. ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పిస్తే విశాఖపట్నం దేశంలోని ప్రధాన ఐటీ నగరాల్లో ఒకటిగా రూపుదిద్దుకోవడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు. యాక్సెంచర్ రాకతో ఈ కల నిజం కావడమే కాకుండా, నగరం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు విశ్వసిస్తున్నాయి.