అన్నదాత సుఖీభవ పథకం – ఆంధ్రప్రదేశ్ రైతులకు ఆర్థిక భరోసా
రైతులు దేశ ఆర్ధిక వ్యవస్థకు మూలస్తంభంగా నిలుస్తారు. అయితే రోజురోజుకూ పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు, ఎరువులు, విత్తనాల ధరలు, వర్షాభావం వంటి ప్రకృతి వైపరీత్యాలు రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అలాంటి సమయంలో వారికి ఆర్థికంగా అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం రైతులకు భారీ ఊరట కలిగిస్తోంది. ఇది రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతులతో పాటు కౌలు రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే సంక్షేమ కార్యక్రమం. రైతులు వ్యవసాయం చేసేందుకు ప్రోత్సాహంగా, పెట్టుబడికి భరోసాగా ప్రభుత్వం ఏటా ఒక్కో రైతుకు రూ.20,000 మంజూరు చేయనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చే రూ.6,000, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.14,000 కలిపి మొత్తం రూ.20 వేలు రైతు ఖాతాలో డైరెక్ట్గా జమ చేస్తారు.
అర్హతలు మరియు లబ్ధిదారుల ఎంపిక
ఈ పథకానికి అర్హత పొందేందుకు రైతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడై ఉండాలి. 5 ఎకరాల లోపు భూమి కలిగిన చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు అర్హులు. వయస్సు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. భూమికి సంబంధించిన పట్టా పత్రాలు, పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోటో వంటి ఆధారాలను సమర్పించాలి. అలాగే ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతాతో లింక్ అయ్యి ఉండాలి. కౌలుకు భూమి తీసుకొని వ్యవసాయం చేసే రైతులు తప్పనిసరిగా కౌలు ధృవీకరణ పత్రం (CCRC) కలిగి ఉండాలి. ఇది వ్యవసాయ శాఖ నుంచి పొందవలసిన పత్రం. ఒక కుటుంబాన్ని యూనిట్గా పరిగణించి, ఒక్కరికే లబ్ధి అందేలా పాలసీ రూపొందించారు.
దరఖాస్తు ప్రక్రియ మరియు స్టేటస్ తెలుసుకునే విధానం
రైతులు తమ ఆధార్ కార్డు, భూమి పత్రాలు, బ్యాంక్ పాస్బుక్ తదితర పత్రాలతో గ్రామ రైతు సేవా కేంద్రాన్ని (RBK) సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి. అక్కడి సిబ్బంది రైతు వివరాలను వెబ్ల్యాండ్ సిస్టమ్లో నమోదు చేస్తారు. అనంతరం వాటిని గ్రామ వ్యవసాయ సహాయకులు, మండల వ్యవసాయ అధికారులు పరిశీలించి జిల్లా వ్యవసాయ అధికారికి ఫార్వార్డ్ చేస్తారు. ఎంపికైన రైతుల ఖాతాల్లో డబ్బును మూడు విడతలుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా జమ చేస్తారు. దరఖాస్తు పరిస్థితి తెలుసుకోవాలంటే, అధికారిక వెబ్సైట్ https://annadathasukhibhava.ap.gov.in కి వెళ్ళి, (‘Know Your Status’) ఆప్షన్ను ఎంచుకొని ఆధార్ నంబర్ లేదా మొబైల్ నంబర్తో చెక్ చేయవచ్చు.
ఎవరికీ ఈ పథకం వర్తించదు?
ఈ పథకం ఆదాయపన్ను చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రూ.10 వేలు పైగా పింఛన్ పొందేవారు, అన్ని ప్రభుత్వ సంస్థల్లో శాశ్వత ఉద్యోగస్తులు వంటి వారికి వర్తించదు. అయితే క్లాస్–4, గ్రూప్–డి ఉద్యోగులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఒక్క కుటుంబంలో ఇద్దరికి ఈ పథకం వర్తించదు. భార్య–భర్త, పిల్లలను ఒకే కుటుంబంగా పరిగణిస్తారు.
ముఖ్యమైన తేదీలు మరియు సూచనలు
ఈ పథకానికి దరఖాస్తు చివరి తేదీ 2025 మే 20గా ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల అర్హులైన రైతులు తమ గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి వెంటనే నమోదు చేసుకోవాలి. భవిష్యత్లో ఏవైనా మార్పులు వచ్చినా, ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ ద్వారా సమాచారం అందిస్తుంది.
పథకం ప్రయోజనాలు
ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడికి మద్దతుగా పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం లభిస్తుంది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి, వ్యవసాయ పనులు నిర్వహించడానికి ఇది ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. పంటలు విఫలమైన సందర్భాల్లోనూ ఇది కొంత భరోసాగా నిలుస్తుంది. పథకం ద్వారా రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు వ్యవసాయంపై వారి నమ్మకం పెరుగుతుంది.
read also: Krishna Mohan Reddy: కృష్ణమోహన్ రెడ్డి అరెస్టును ఖండించిన యాంకర్ శ్యామల