ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక న్యాయం పరంగా మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో భూమి లేని పేద కుటుంబాలకు పింఛన్లు మళ్లీ మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం వేలాది కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది. ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉండగా తాజాగా మరో 1575 కుటుంబాలకు పింఛన్లు అందించనుంది. 2015లో ఇంటింటి సర్వే ద్వారా అమరావతి (Amaravathi) లో భూమి లేని పేదలకు పింఛన్లు మంజూరు చేశారు. అయితే వివిధ కారణాలతో ఈ 1575 కుటుంబాలకు పింఛన్ నిలిచిపోయింది. ఇటీవల జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఈ విషయంపై చర్చించారు. ఈ 1575 కుటుంబాలకు పింఛన్లు అందించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
పింఛన్ రూపంలో
ఆ నిర్ణయం ఆధారంగా ఆదివారం అమరావతిలో భూమి లేని 1575 కుటుంబాలకు పింఛన్లు మంజూరు చేయాలంటూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి.మరోవైపు రాజధాని అమరావతి పరిధిలో ఉండే 29 గ్రామాలలో భూములు లేని పేదలకు 2014- 2015 నుంచి పింఛన్లు అందిస్తున్నారు. తొలుత నెలకు రూ.2500 పింఛన్ (Pension) రూపంలో అందించగా ఆ తర్వాత పింఛన్ మొత్తాన్ని రూ.5000లకు పెంచారు. అయితే గత ప్రభుత్వ హయాంలో వీరికి పింఛన్లు సరిగా పంపిణీ చేయలేదని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ల పంపిణీ కోసం నిధులు కూడా విడుదల చేసింది.
భూములిచ్చిన రైతులకు
అమరావతిలో 19 వేలమంది వరకూ భూమిలేని పేదలకు పింఛన్లు అందిస్తున్నారు.ఇప్పుడు మరో 1575 కుటుంబాలకు అందించనుండటంతో ఈ సంఖ్య 20 వేలు దాటనుంది. మరోవైపు రాజధాని అమరావతి నిర్మాణానికి భూసమీకరణ (Land consolidation) సమయంలో భూములిచ్చిన రైతులకు కౌలు డబ్బులు, భూములు లేని పేదలకు పింఛన్లు అందిస్తామని అప్పట్లో టీడీపీ ప్రభుత్వం హమీ ఇచ్చింది. ఆ మేరకు కౌలు డబ్బులు, పింఛన్లు అందిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో పింఛన్ ఎంత పంపిణి చేస్తారు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్ స్కీమ్’ కింద, లబ్ధిదారులకు ప్రతి నెలకు ₹4,000 చొప్పున పింఛన్ అందుతుంది. అయితే, వికలాంగులకు ₹6,000 పింఛన్ నెలకు మంజూరవుతుంది.
ఆంధ్రప్రదేశ్లో పింఛన్ స్కీమ్ ఎవరు ప్రారంభించారు?
ఆంధ్రప్రదేశ్లో వృద్ధాప్య పింఛన్ పథకాన్ని మొదటిగా ప్రారంభించిన వ్యక్తి డామోదరం సంజీవయ్య గారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Anam Ramanarayana Reddy: టీటీడీలో అన్యమత ఉద్యోగులున్నారు