తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ బంద్ వివాదం (Theaters Bandh) రోజుకో మలుపు తిరుగుతున్న నేపథ్యంలో, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind) స్పందించారు. ‘‘ఇప్పుడు ప్రతిచోటా ‘ఆ నలుగురు’ అనే మాట వినిపిస్తోంది. నేను ఆ నలుగురిలో లేను. ఆ వ్యాపారం నుంచి బయటకు వచ్చేశాను. తెలంగాణాలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు. ఏఏఏ మల్టీప్లెక్స్ తప్ప రెండు రాష్ట్రాల్లో 15 థియేటర్లు కూడా లేవు. అవి కూడా త్వరలో ఉండవు’’ అని స్పష్టం చేశారు. తనను అనవసరంగా ఈ వివాదంలో లాగవద్దని మీడియాను కోరారు.
పవన్ సినిమా ముందు బంద్ అంటే దుస్సాహసమే
పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సమయం లో థియేటర్ల బంద్ పిలుపు దుస్సాహసమని అల్లు అరవింద్ అన్నారు. పవన్ కళ్యాణ్ సినిమా పరిశ్రమకు సహకారం చేస్తున్న వ్యక్తి అని, ‘కల్కి 2898 ఏడి’ టికెట్ ధరలు పెంచే విషయంపై చర్చించేందుకు కూడా పవన్ దగ్గరికి నిర్మాతలంతా వెళ్లారని గుర్తు చేశారు. అప్పుడే ఆయన సీఎంని కలవాలని సూచించారంటూ వివరించారు. కానీ, ఆ సలహా ఫలంగా మారలేదని అన్నారు.
పవన్ లేఖలోని ప్రశ్నలు సబబే
పవన్ కళ్యాణ్ కార్యాలయం విడుదల చేసిన లేఖను తాను చదివానని, అందులోని ప్రశ్నలు సరైనవేనని అల్లు అరవింద్ అన్నారు. ‘‘పవన్ కళ్యాణ్ బాధలో నిజముంది. థియేటర్లు మూసివేయాలన్నది ఏకపక్ష నిర్ణయం. అందుకే నేను ఫిలిం ఛాంబర్ సమావేశాలకు హాజరుకాలేదు. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ స్పందన చాలా సమంజసం’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వివాదంలో కీలక థియేటర్ హోల్డర్లైన ‘దిల్’ రాజు, సురేష్ బాబు ఎలా స్పందిస్తారు? అనేదే ఇప్పుడు సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన అంశంగా మారింది.
Read Also : Miss World 2025 : మిస్ ఇంగ్లండ్ ఆరోపణలపై ప్రభుత్వం విచారణ