ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని వరద ముప్పు నుంచి శాశ్వతంగా రక్షించేందుకు ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. రాజధాని అమరావతి ప్రాంతంలో వరద నీటి ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు రూ. 595.01 కోట్ల భారీ వ్యయంతో రెండో ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉండవల్లి సమీపంలో ఏర్పాటు కానున్న ఈ పంపింగ్ స్టేషన్ అత్యంత శక్తివంతమైనదిగా నిలవనుంది. దీని సామర్థ్యం సెకనుకు 8,400 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసేలా డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే కొండవీటి వాగుపై 5,000 క్యూసెక్కుల సామర్థ్యంతో ఒక పంపింగ్ స్టేషన్ అందుబాటులో ఉండగా, ఇప్పుడు కొత్తగా రాబోతున్న ఈ రెండో స్టేషన్ అమరావతి లోతట్టు ప్రాంతాలకు కొండంత అండగా నిలవనుంది.
Pratyusha: కోర్టు తీర్పుపై స్పందించిన ప్రత్యూష తల్లి
ఈ ప్రాజెక్టు కేవలం నిర్మాణం వరకే పరిమితం కాకుండా, రాబోయే 15 ఏళ్ల పాటు దీని నిర్వహణ బాధ్యతలను కూడా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థే చూసుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఇందులో భాగంగా సర్వే, డిజైన్, నిర్మాణం వంటి అన్ని దశలను సదరు సంస్థే పర్యవేక్షించాల్సి ఉంటుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు కొండవీటి వాగు నుంచి వచ్చే వరద నీరు కృష్ణా నదిలోకి సజావుగా వెళ్లేందుకు ఈ పంపింగ్ స్టేషన్లు అత్యంత కీలకం. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, భవిష్యత్తులో ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా నగరం సురక్షితంగా ఉండేలా ప్రభుత్వం ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com