వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ (Minister Jogi Ramesh) చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ పరాజయానికి అమరావతి (Amaravati) అంశం కూడా ఒక కారణమని ఆయన స్పష్టం చేశారు. ఓ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజధాని విషయంపై మాట్లాడుతూ, పార్టీ అధికారిక వైఖరికి భిన్నంగా మాట్లాడడం గమనార్హం.మూడు రాజధానుల సిద్ధాంతం వెనక ఉద్దేశం మంచిదే అయినా, ప్రజలు దానిని మన్నించలేకపోయారని జోగి రమేశ్ అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న దృష్టితోనే ఈ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. అయినా ప్రజల్లో అది నమ్మకాన్ని కలిగించలేదని చెప్పారు.ప్రజల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని పార్టీ తన వైఖరిని పునరాలోచించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. త్వరలో పార్టీ అధినేతతో ఈ విషయంపై చర్చిస్తానని తెలిపారు. రాజధాని విషయంలో ప్రజల మనసులో మార్పు రావడం సహజమని, పార్టీ కూడా అందుకు తగ్గట్లు స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.
విశాఖ అభివృద్ధే లక్ష్యం: జగన్ ఆశయం
విశాఖపట్నం ఆర్థిక రాజధాని అవ్వాలని గతంలో చంద్రబాబు చెప్పారు. ఇప్పుడు అదే విధంగా కూటమి ప్రభుత్వం కూడా ముందుకెళ్తుందని జోగి రమేశ్ పేర్కొన్నారు. విశాఖలో పెట్టుబడులు రావడం, అభివృద్ధి సాధించడం తమ పార్టీ ఆశయమని చెప్పారు. అభివృద్ధి ఒక్క చోటే కాకుండా అన్ని ప్రాంతాల్లో సాగాలని జగన్ భావించారని వివరించారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
జోగి రమేశ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. రాజధాని విషయంలో వైసీపీ నేత నుంచి వచ్చిన ఈ కొత్త స్వరం రాజకీయ చర్చలకు దారితీస్తోంది. పార్టీ ఓటమి, ప్రజా స్పందన, భవిష్యత్ అభివృద్ధిపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరిణామాల్లో కొత్త దారితెరుస్తున్నాయి.