అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన జీవీ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై, ఆయన నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయకత్వంపై తనకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘కూటమి ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ బడ్జెట్ రూ. 3 లక్షల 22 వేల కోట్లతో ప్రణాళికబద్ధంగా రూపొందించారు. కేవలం రూ. 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే బడ్జెట్ రూపొందించడం విశేషం.
2029లో కూడా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి అవ్వాలి
నేను (జీవీ రెడ్డి) నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయకత్వంపై ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటాయి. తక్కువ కాలంలోనే అటు టీడీపీ లోనూ, ఇటు ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడాన్ని నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ మా సార్ చంద్రబాబు రుణపడి ఉంటాను. అని జీవీ రెడ్డి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు. ఏపీ పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవాలి. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలనే కోరుకోవడం తెలుగు వ్యక్తి బాధ్యత అని జీవీ రెడ్డి తన పోస్టులో రాసుకొచ్చారు.