తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు సుమారు రూ. 1,700 కోట్లకు పైగా అప్పు చేస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ప్రస్తుతం రాష్ట్రం అప్పు రూ. 8.6 లక్షల కోట్లకు చేరుకుందని ఆయన పేర్కొన్నారు. శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో జరిగిన చర్చ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమిషానికి రూ. 1 కోటికి పైగా అప్పు చేస్తోందని తీవ్ర విమర్శలు గుప్పించారు.

ప్రజలపై రుణభారం పెరుగుతుందని హెచ్చరిక
రాష్ట్ర ప్రజలపై ఈ అప్పుల ప్రభావాన్ని వివరిస్తూ, ప్రతి వ్యక్తిపై రుణభారం సుమారు రూ. 2.27 లక్షలుగా ఉందని మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ స్థాయిలో రుణాలు ఉంటే తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పెరుగుతున్న అప్పులతో భవిష్యత్ తరాలు సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధుల కేటాయింపుపై మాట్లాడిన మహేశ్వర్ రెడ్డి, యూపీఏ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో వాటా 32 శాతం మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వాటాను 42 శాతానికి పెంచిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులను పెంచి ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిపాలనలో విఫలమై అప్పులు చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ అప్పులపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న వేళ, అధికార పార్టీ తరఫున అప్పులు రాష్ట్ర అభివృద్ధికి అవసరమేనని, మౌలిక సదుపాయాల కోసం ఉపయోగిస్తున్నామని చెబుతోంది. అయితే, రాబోయే రోజుల్లో ఈ అప్పుల ప్రభావం ప్రజలపై ఎంతవరకు పడుతుందనేది వేచిచూడాల్సిన అంశం.