మ్యూజిక్, మూవీస్, జర్నలిజం, రీసర్చ్…ఇలా విభిన్న రంగాలకు చెందిన మహిళా బృందం ఏప్రిల్ 14న అంతరిక్షంలోకి ప్రయాణించనుంది. జెఫ్ బెజోస్ స్థాపించిన అంతరిక్షయాన సంస్థ ‘బ్లూ ఆరిజిన్’ తన న్యూ షెపర్డ్ రాకెట్లో ఆరుగురు మహిళలను అంతరిక్షంలోకి పంపుతోంది. 1963లో సోవియట్కు చెందిన మహిళా కాస్మోనాట్ వాలెంటినా తెరిష్కోవా సింగిల్గా ప్రయాణించిన తర్వాత జరుగుతున్న పూర్తి మహిళా అంతరిక్ష ప్రయాణం ఇదే. ఏప్రిల్ 14న రాత్రి 7 గంటలకు రాకెట్ లాంచ్ జరుగుతుంది.
కర్మన్ రేఖను దాటుతారు
ఈ బృందంలో పాప్ సింగర్ కేటీ పెర్రీ, జర్నలిస్ట్ గేల్ కింగ్, పౌర హక్కుల న్యాయవాది అమండా ఇంన్గుయెన్, నాసా మాజీ శాస్త్రవేత్త ఐషా బోవే, చిత్ర నిర్మాత కెరియాన్ ఫ్లిన్ ఉన్నారు. వారితో పాటు ఆరో మహిళ లారెన్ సాంచెజ్ కూడా చేరనున్నారు. ఈ బృందానికి నాయకత్వం వహించనున్న ఆమె, జెఫ్ బెజోస్ గర్ల్ఫ్రెండ్ కూడా. వీళ్లందరూ భూమికి, అంతరిక్షానికి మధ్య ఉన్న ఊహాత్మక సరిహద్దు అయిన కర్మన్ రేఖను దాటుతారు. ఇది భూ వాతావరణానికి ఆవల ఉంటుంది.

ఒక చిన్న ప్రయాణం
ఈ ఆరుగురు మహిళలు న్యూ షెపర్డ్-31 మిషన్లో భాగంగా బ్లూ ఆరిజిన్కు చెందిన రాకెట్లో ప్రయాణించనున్నారు. దాని లోపల ఉన్న స్పేస్క్రాఫ్ట్ పూర్తిగా ఆటోమేటెడ్. అంటే దీనిని ఆపరేట్ చేయడానికి లోపల ఎవరూ ఉండరు. మిషన్ ప్రయాణం దాదాపు 11 నిమిషాలు ఉంటుంది. కర్మన్ రేఖ వద్ద ఈ మహిళలంతా కొన్ని నిమిషాలపాటు జీరో గ్రావిటీని అంటే భారరహిత స్థితిని అనుభవిస్తారు. అంతరిక్షం నుంచి కొద్దిసేపు భూ గ్రహాన్ని వీక్షిస్తారు. పాప్ గాయని కేటీ పెర్రీ మ్యూజిక్ టూర్ ఏప్రిల్ 23న ప్రారంభమవుతుంది. అందుకే, ఏప్రిల్ 14న ఈ మిషన్ పూర్తి చేయాలని బ్లూ ఆరిజిన్ నిర్ణయించింది.
అమెరికాలోని వెస్ట్ టెక్సాస్లోని కంపెనీ ప్రయోగ కేంద్రం నుంచి న్యూ షెపర్డ్ రాకెట్ను ప్రయోగిస్తారు. 2023లో వోగ్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, పూర్తిగా మహిళలే అంతరిక్షయానం చేయాలనే తన కల గురించి ప్రస్తావించారు లారెన్ సాంచెజ్. “ఇది కేవలం అంతరిక్ష యాత్ర కాదు. ప్రజల ఆలోచనలను మార్చడం, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చే లక్ష్యంతో జరిగే యాత్ర.” అని బ్లూ ఆరిజిన్ ఒక ప్రకటనలో తెలిపింది.
కర్మన్ రేఖ ఏమిటి?
కర్మన్ రేఖ అనేది ఒక ఊహాత్మక సరిహద్దు. దీనిని భూమిపై సముద్ర మట్టానికి 100 కి.మీ ఎత్తులో ఉన్నట్లు నిర్వచించారు. ఈ సరిహద్దును భూ వాతావరణం ముగింపు, అంతరిక్షానికి ఆరంభంగా భావిస్తారు. భూ వాతావరణం, బాహ్య అంతరిక్షం మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి ఫెడరేషన్ ఏరోనాటిక్ ఇంటర్నేషనలీ (ఎఫ్ఏఐ) అనే సంస్థ ఈ కర్మన్ రేఖను నిర్ణయించింది. ఈ ఎత్తుకు చేరుకోవడాన్ని అంతరిక్ష పరిశోధనలో ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణిస్తారు.
“అంతర్జాతీయంగా ఆమోదించిన నియమాల ప్రకారం, కర్మన్ రేఖ అనేది అంతరిక్షానికి ప్రారంభ స్థానం” అని మొహాలీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్లో ప్రొఫెసర్, మాజీ శాస్త్రవేత్త డాక్టర్ టి.వి. వెంకటేశ్వరన్ అన్నారు. వెంకటేశ్వరన్ చెప్పినదాని ప్రకారం, భూ వాతావరణం 99.9 శాతం ముగిసే ప్రాంతమే కర్మన్ రేఖ. అది దాదాపు 100 కి.మీ ఎత్తు ఉంటుంది. అందువల్ల, దాని పైన ఉన్న ప్రాంతాన్ని అంతరిక్షంగా నిర్ణయించారు. ఈ సరిహద్దు రేఖను దాటిన వారిని ‘అంతరిక్ష యాత్రికులు’గా పరిగణిస్తారు. అందుకే బ్లూ ఆరిజిన్కు చెందిన రాకెట్లు ఈ రేఖను దాటి వెళ్లి, దానిలోని ప్రయాణించిన వారికి నిజమైన అంతరిక్ష అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.