ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఇప్పటికే నూతన మార్గాలపై పయనిస్తోంది. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే వ్యవసాయాన్ని శాస్త్రీయంగా, సాంకేతికంగా, డేటా ఆధారంగా చేయడం ప్రారంభించాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ ప్రతీ రంగంలో రోజురోజుకూ విస్తరిస్తూ ఉంది. భారత్లో బారామతి రైతుల ఈ ప్రయోగం ఈ మార్గంలో అడుగు వేసిన తొలి ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఇది కేవలం శాస్త్రీయ ప్రయోగం మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల భవిష్యత్తు మార్పుకు సంకేతంగా నిలుస్తోంది.

చెరకు పంటతో మార్పు
చెరకు పంట ద్వారా మొదలైన ఈ ఏఐ వ్యవసాయ విప్లవం తర్వాతి దశల్లో బియ్యం, మిర్చి, కూరగాయలు, పత్తి, గోధుమ వంటి పంటలకూ విస్తరించనుంది. దీని వల్ల ఒక్క రైతులకే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకూ భారీ ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశం ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత దేశం. జనాభాలో సుమారు 60 శాతం మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు. అలాంటి రంగాన్ని సాంకేతికతతో మిళితం చేయడం వల్ల క్రాంతికార మార్పులు సంభవించవచ్చు. బారామతి రైతుల విజయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు స్పందించడం, ఇది సామాన్య రైతుకు ప్రపంచ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా భారత రైతు గ్లోబల్ టెక్నాలజీ వేదికపై నిలిచినట్లయింది. ఇది కొత్త మార్గాన్ని సూచించే ఉదాహరణగా నిలిచింది. సాధారణంగా చెరకు నెలకు 2 నుంచి 2.5 కణుపులు పెరుగుతుంది. ఒక్కో గెడకు 45 కణుపులు ఉంటాయి. కానీ ఈ ఏఐ సాగులో నెలకు 3.5 నుంచి 4 కణుపులు పెరుగుతాయి. ఒక గెడలో మొత్తంగా 55 కణుపులు ఉంటాయి. సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుండగా.. ఆదాయం రూ.2 లక్షలు వస్తుంది. అదే ఏఐ సాగులో మాత్రం రూ.30 వేల నుంచి రూ.40 వేలు పెట్టుబడి పెడితే రూ.3 లక్షల దిగుబడి సంపాదించే అవకాశం ఉంది.
ఇతర రాష్ట్రాల్లోనూ ప్రారంభమవుతున్న ప్రయోగాలు
బారామతిలో విజయవంతమైన ఈ ప్రాజెక్ట్ను ఇతర రాష్ట్రాల్లోనూ అనుసరించేందుకు ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే రైతులు ఈ విధానాన్ని పరిశీలిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ప్రారంభమైయింది కూడా ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే, ఇది అతి తక్కువ కాలంలో దేశవ్యాప్తంగా విస్తరించగలదు.
రైతుల భద్రత, శిక్షణ కీలకం
ఏఐ వ్యవసాయాన్ని పూర్తిగా సాధించాలంటే రైతులకు శిక్షణ ఎంతో అవసరం. వారి వద్ద స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ లభ్యత ఉండాలి. మౌలిక సదుపాయాల మరమ్మతు, డిజిటల్ లిటరసీ పెంపు కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు అవసరం. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు కలిసి రైతులను ఈ మార్గంలో నడిపించాలి. ఈ రంగంలో ఏఐను చొప్పించాలంటే పాలకులు సరికొత్త విధానాలు రూపొందించాలి. మౌలిక సదుపాయాల కల్పన, టెక్నాలజీ బదిలీ, ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుతో పాటు, సబ్సిడీల రూపంలో ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ముఖ్యంగా చిన్న రైతులు దీన్ని అందుబాటులోకి తెచ్చుకునేలా ప్రభుత్వ పాత్ర కీలకం.
Read also: Temples: దేశంలోనే పేరొందిన రామాలయాలు ఇవే..తప్పక దర్శించుకోండి