ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్ (Ahmedabad) విమానాశ్రయంలో జరిగిన ఎయిర్ ఇండియా 787-8 డ్రీమ్లైనర్ విమాన ప్రమాదం (Plane Crash) దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో పలువురు అమూల్యమైన ప్రాణాలు కోల్పోగా, ఇంకా కొన్ని మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

డీఎన్ఏ పరీక్షల ఆధారంగా మృతదేహాల గుర్తింపు
అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 87 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ఇప్పటికే 47 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక గుర్తించిన మిగతా మృతదేహాలను సైతం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇక ఇదే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ డెడ్ బాడీని అధికారులు డీఎన్ఏ (DNA) పరీక్ష ద్వారా గుర్తించిన విషయం తెలిసిందే.
దర్యాప్తులో కీలక ఆధారాల సేకరణ
విమాన ప్రమాదంపై దర్యాప్తును మరింత వేగవంతం చేసేందుకు సంబంధిత యంత్రాంగాలు పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాయి. ఎయిర్ ఇండియా విమానానికి చెందిన కాక్పిట్ వాయిస్ రికార్డర్ దొరకడంతో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదం ఎలా, ఎందుకు జరిగిందన్న అంశాలను తెలుసుకునేందుకు కాక్పిట్ వాయిస్ రికార్డర్ కీలకం కానుంది. ఫ్లయిట్ డేటా రికార్డర్ను గుర్తించినట్లు ఇంతకుముందే ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఏఏఐబీ) వెల్లడించింది.
అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల భాగస్వామ్యం
ఈ ఘోర విమాన ప్రమాదంపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. భారతదేశంలో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రధానంగా విచారణ చేపడుతుండగా, అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు కూడా ఈ ఘటన పట్ల విచారణ కొనసాగిస్తోంది. అలాగే ఎయిర్ ఇండియా విమానం అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థది కావడంతో ఆ దేశం కూడా విచారణలో సహకరిస్తోంది.
బోయింగ్ సంస్థ ప్రత్యేక బృందం విచారణలో
బోయింగ్ సంస్థకు చెందిన నిపుణుల బృందం ఇప్పటికే అహ్మదాబాద్కు చేరుకుని తమ విచారణను ప్రారంభించింది. కూలిన విమానం 787-8 డ్రీమ్లైనర్ మోడల్ కావడంతో బోయింగ్ సంస్థ ఈ ఘటనపై సమగ్ర స్థాయిలో విచారణ చేపట్టనుంది.
Read also: Plane Crash: ప్రయాణికుల ఫోన్ నంబర్లే అత్యవసర సమాచారం
Ahmedabad Plane Crash: లభ్యమైన బ్లాక్ బాక్స్లు దర్యాప్తులో పురోగతి