బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తీవ్రంగా స్పందించారు. దేశంలో ఎక్కడా చూడనంత దౌర్భాగ్యమైన కుమ్మక్కు రాజకీయం తెలంగాణలోనే జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ నాయకుడు సీఎం రమేశ్కు రాష్ట్రంలోనే రూ. 1660 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ దక్కిందని, అదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డికి బంధువు అయిన ఆయన బావమరిదికి కేంద్రంలోని బీజేపీ సర్కారులో రూ. 1137 కోట్ల అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇది బీజేపీ–కాంగ్రెస్ పొత్తుని బట్టబయలు చేస్తోందని, ఇది దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని విమర్శించారు.
1660 కోట్ల రోడ్ స్కాం – HCU భూముల దోపిడి
కేటీఆర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రాజెక్టు కోసం రోడ్డుల పేరుతో 1660 కోట్ల విలువైన కాంట్రాక్టులు అప్పగించబడ్డాయన్నారు. అంతేకాక హెచ్సీయూ భూములను తాకట్టు పెట్టి 10 వేల కోట్లు దోచుకున్న స్కాంలోనూ ఈ రెండు పార్టీల నాయకులు పాత్ర వహించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి డబ్బు సంపాదించేందుకు సీఎం రమేశ్కు రిటర్న్ గిఫ్ట్గా రోడ్ కాంట్రాక్టులు ఇచ్చినట్లు తేలిపోయిందని చెప్పారు. ఈ విషయాలు ప్రజల దృష్టి నుంచి తప్పించేందుకు బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందన్న పుకార్లను మళ్లీ తెరపైకి తెస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ బలంగా ఉంది – విలీన వార్తలు అవాస్తవం
తెలంగాణ ప్రజల కోసం స్థాపించబడిన బీఆర్ఎస్ పార్టీ, ఎప్పటికీ ఇతర పార్టీల్లో విలీనం కానందని కేటీఆర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడే పార్టీ అని, కాంగ్రెస్ – బీజేపీ మద్దతుదారులు ప్రతిసారి ఇరకాటంలో పడినప్పుడు బీఆర్ఎస్ విలీన వార్తలు రాస్తూ ప్రజలను దారితప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. సీఎం రమేశ్ – సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ కలసి వచ్చి, హెచ్సీయూ భూముల 10,000 కోట్ల స్కాం, 1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ కుంభకోణంపై ఓపెన్ డిబేట్కు రావాలని సవాలు విసిరారు.
Read Also : Asia Cup : ఆసియా కప్ వేదిక ఖరారు టోర్నీ ఎప్పుడంటే?