ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలోని మంగళగిరి ఎయిమ్స్ (AIIMS – All India Institute of Medical Sciences)లో ర్యాగింగ్ కలకలం రేపింది. చదువుకునే వాతావరణం ఉండాల్సిన వైద్య విద్యాసంస్థలో ఒక జూనియర్ విద్యార్థి ర్యాగింగ్ వేధింపులను తట్టుకోలేక మనోవేదనకు లోనై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన విద్యార్థుల్లోనే కాక, తల్లిదండ్రుల్లో కూడా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తిరుపతి (Tirupati) కి చెందిన విద్యార్థి మంగళగిరి ఎయిమ్స్లో వైద్య విద్యను అభ్యసిస్తున్నాడు. గత నెల 22న విద్యార్థి తన స్నేహితుడితో హాస్టల్లో మాట్లాడుతుండగా సీనియర్లు ర్యాగింగ్ చేశారు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆ విద్యార్థి బ్లేడుతో చేయి కోసుకున్నాడు. తోటి విద్యార్థులు గమనించి అతడ్ని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు.
కఠిన చర్యలు
అతడికి డాక్టర్లు సకాలంలో వైద్యం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వెంటనే ఈ విషయం ఎయిమ్స్ ఉన్నతాధికారులకు తెలిసింది.ఈ ర్యాగింగ్ ఎపిసోడ్పై ఢిల్లీలోని యూజీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే స్పందించి ఎయిమ్స్ అధికారులతో మాట్లాడి, బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ర్యాగింగ్ వ్యవహారంపై మంగళగిరి ఎయిమ్స్ యాజమాన్యం (Mangalagiri AIIMS Management) వివరణ కోరుతూ 23న మెయిల్ పంపింది.వెంటనే అంతర్గత విచారణ జరిపిన యాంటీ ర్యాగింగ్ కమిటీ ప్రాథమికంగా 15 మంది విద్యార్థులు బాధ్యులని తేల్చడంతో వారందర్ని సస్పెండ్ చేశారు. అయితేసమగ్ర విచారణలో 13 మంది విద్యార్థుల పాత్ర ఉందని తేలడంతో వారిపై చర్యలు తీసుకున్నారు.

యాజమాన్యం స్పందన
జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన వారిలో ముగ్గురు సీనియర్ విద్యార్థులను ఏడాదిన్నర పాటు సస్పెండ్ చేసి రూ.25 వేలు జరిమానా విధించారు. మరో ఆరుగురిని ఏడాది పాటూ సస్పెండ్ చేసి రూ.25 వేలు జరిమానా (fine) విధించారు. మరో నలుగురిని ఆరు నెలల పాటు సస్పెండ్ చేసిరూ.25 వేల జరిమానా విధించి హాస్టల్ కూడా ఖాళీ చేయించారు. ఇదిలా ఉంటే ఈ ర్యాగింగ్ ఘటనపై గత నెల 24నే పోలీసులకు ఫిర్యాదు చేశామని ఎయిమ్స్ వర్గాలు అంటున్నాయి. పోలీసులు మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కేసు నమోదు చేయలేదన్నారు. అయితే ఈ సస్పెండైన వారిలో ఎయిమ్స్ డీన్ కుమారుడు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.