శ్రీ సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు (Sri Sathya Sai Baba’s Centenary Celebrations) ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. నవంబర్ 15 నుంచి 24వ తేదీ వరకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి(Puttaparthi)లోని ప్రశాంతి నిలయంలో ఈ మహోత్సవాలు జరుగనున్నాయి. సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ వేడుకల్లో ప్రపంచంలోని 185 దేశాల నుంచి భక్తులు హాజరవ్వనున్నారు.
శత జయంతి సందర్భంగా ప్రత్యేక స్మారకాలు
నవంబర్ 23న బాబా జన్మదినాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం తరఫున బాబా పేరుతో ప్రత్యేక పోస్టల్ స్టాంప్, రూ.100 నాణెాన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం ప్రశాంతి నిలయంలో జరుగనుంది. దీనివల్ల బాబా సేవా దృక్పథాన్ని, ఆయన సందేశాలను ప్రపంచానికి మరింత సమీపంగా తీసుకెళ్లే అవకాశం కలుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
రాష్ట్ర పండుగగా గుర్తించిన ఏపీ ప్రభుత్వం
శ్రీ సత్యసాయిబాబా శత జయంతిని పురస్కరించుకుని, నవంబర్ 23వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా “రాష్ట్ర పండుగ”గా ప్రకటించింది. ఇది బాబా ప్రభావాన్ని, ఆయన విశ్వవ్యాప్త సేవా తత్వాన్ని గుర్తించే విషయంలో ఓ గొప్ప గుర్తింపుగా నిలుస్తుందని భక్తులు పేర్కొంటున్నారు. పుట్టపర్తిలో ఇప్పటికే ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ వేడుకలు సత్యసాయి ఆశయాలను పునరుద్ఘాటించే గొప్ప వేదికగా నిలవనున్నాయి.
Read Also : Israel vs Iran : ఇజ్రాయెల్ పై మిస్సెల్స్ లాంచ్ చేసిన ఇరాన్