రాష్ట్రానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCC) ద్వారా కొత్త జీవం పోసేందుకు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) విశేష ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు అందించాలనే ఉద్దేశంతో ఆయన అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఐటీ రంగంలో ఇప్పటివరకు 95 ప్రముఖ సంస్థలు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి (Companies invest Rs 1 lakh crore) ప్రణాళికలు రూపొందించాయి. వీటిలో టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలకు విశాఖలో భూముల కేటాయింపు పూర్తయినట్టు అధికారులు తెలిపారు. వీరి యూనిట్లు త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని లోకేశ్ సూచించారు.తాజాగా జరిగిన బెంగళూరు పర్యటనలో ఏఎన్ఎస్ఆర్, సత్వ సంస్థలతో జీసీసీ ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల వల్ల రాష్ట్ర యువతకు 35,000 ఉద్యోగాలు లభించనున్నాయి. ఒప్పందాలు కుదిరిన సంస్థలతో అధికారులు క్రమం తప్పకుండా సంప్రదింపులు కొనసాగించాలని లోకేశ్ స్పష్టం చేశారు.

డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ను వేగవంతం చేయాలి
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ప్రతిపాదిత డ్రోన్ సిటీ ప్రాజెక్ట్ను ఏడాదిలో పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు. వ్యవసాయం, పోలీసింగ్, వాతావరణ రంగాల్లో డ్రోన్ల వినియోగంపై చైతన్య కార్యక్రమాలు జరపాలని సూచించారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభానికి సిద్ధం
స్టార్టప్లకు బలం చేకూర్చే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను త్వరలో ప్రారంభించనున్నట్టు లోకేశ్ ప్రకటించారు. అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టులో టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐబీఎం భాగస్వాములుగా ఉన్నారని వెల్లడించారు.
మనమిత్ర సేవలను బలోపేతం చేయాలని సూచన
మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మరింత విస్తరించాలని మంత్రి సూచించారు. ఇప్పటికే 702 సేవల్లో 535 సేవలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్లను బ్లాక్ చైన్ ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్, ఎయిర్పోర్టులకు ఫోన్ కనెక్టివిటీ
రాష్ట్రంలోని 45,000 పాఠశాలల్లో ఇంటర్నెట్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి ఎయిర్పోర్టుల్లో ఫోన్ కనెక్టివిటీ సమస్యల్ని తొలగించాలన్నారు.
Read Also : China : కొత్త రకం రోబోలను తయారుచేసిన చైనా