Interest rates : ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో బ్యాంకులూ వడ్డీ రేట్ల తగ్గింపునకు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ రంగంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) తమ రెపో ఆధారిత రుణాలపై కనీస వడ్డీ రేటు 0.35 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. మిగతా బ్యాంకులూ ఇదే బాటలో నడుస్తాయని భావిస్తున్నారు.

యూకో బ్యాంక్ కూడా ఇదే బాటలో
తమ రెపో ఆధారిత రుణాలపై కనీస వడ్డీ రేటును ఈ నెల 11 నుంచి 9.05 శాతం నుంచి 8.7 శాతానికి కుదిస్తున్నట్టు ఇండియన్ బ్యాంక్ తెలిపింది. పీఎన్బీ, బీఓఐ కూడా తమ రెపో ఆధారిత రుణాలపై కనీస వడ్డీ రేటును 9.10 శాతం 8.85 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. యూకో బ్యాంక్ కూడా ఇదే బాటలో నడిచింది. తన రెపో ఆధారిత రుణాలపై కనీస వడ్డీ రేటును గురువారం నుంచి 8.8 శాతానికి తగ్గించింది.
ఇండ్ల అమ్మకాలు ఊపందుకుంటాయి
కాగా, ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించడం వలన ఇండ్ల అమ్మకాలు ఊపందుకుంటాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. గృహ రుణాలపై వడ్డీ రేట్లను బ్యాంకులు తగ్గిస్తాయని, ఫలితంగా ఇండ్ల అమ్మకాలు పెరుగుతాయని చెబుతున్నాయి. ముఖ్యంగా రూ. కోటి కంటే తక్కువ ధర ఉన్న ఇండ్ల అమ్మకాలు ఊపందు కుంటాయని ఆశిస్తున్నాయి. రియల్టీ సంస్థలు క్రెడాయ్, నరెడ్కో రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని స్వాగతించాయి. రియల్టీ కన్సల్టెన్సీ కంపెనీల డేటా ప్రకారం, ఈ ఏడాది మార్చి క్వార్టర్లో ఇండ్ల అమ్మకాలు ఏడాది లెక్కన 28 శాతం పడ్డాయి.
Read Also: మరోసారి ఆర్బీఐ గుడ్న్యూస్..కీలక వడ్డీరేట్లు తగ్గింపు