మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan) పొదిలి పర్యటన సమయంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. వైసీపీ కార్యకర్తలు నల్ల బెలూన్లు, ప్లకార్డులతో నిరసన తెలిపిన మహిళలపై రాళ్లు, చెప్పులతో దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మరియు ముగ్గురు పోలీసులు గాయపడటం, పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలపై జరిగిన వ్యాఖ్యలపై మహిళలు నిరసన వ్యక్తం చేయగా, వైసీపీ మద్దతుదారులు ఆగ్రహంతో దాడి చేసినట్లు సమాచారం.
పోలీసులు వీడియో ఆధారంగా నిందితుల గుర్తింపు
పోలీసుల బాడీ కెమెరాలు, పబ్లిక్ సీసీ కెమెరాల ఆధారంగా దాడిలో పాల్గొన్న నిందితుల గుర్తింపు కొనసాగుతోంది. ఇప్పటికే జూన్ 12న తొమ్మిది మందిని అరెస్ట్ (Arrest) చేసిన పోలీసులు, తాజాగా మరికొద్ది ఆధారాలతో మరో 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ దృశ్యాల్లో దర్శి డీఎస్పీ లక్ష్మీనారాయణపై చెప్పులతో నేరుగా దాడి చేసిన దృశ్యాలు స్పష్టంగా కనిపించాయని సమాచారం. శాంతియుత నిరసనపై జరిగిన ఈ దాడిని సీఎం చంద్రబాబు సీరియస్గా తీసుకుని, డీజీపీకి తక్షణ చర్యలపై ఆదేశాలు జారీ చేశారు.
నిందితులపై వైద్య పరీక్షలు, కోర్టుకు హాజరు
అరెస్ట్ చేసిన 15 మందిని పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని పొదిలి కోర్టుకు హాజరు పరచనున్నట్లు సమాచారం. మరోవైపు, మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు శాంతియుతంగా ఆందోళనలు చేపడుతున్న సమయంలో జరిగిన ఈ దాడి పోలీసు వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని కించపరిచే ప్రయత్నమని పోలీసులు పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని తదుపరి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడనున్నట్లు స్పష్టం చేశారు.
Read Also : Anirudh – Kavya Maran : అనిరుధ్ తో కావ్య మారన్ పెళ్లి?