తుంగభద్ర నది (Tungabhadra ) పరవళ్లు తొక్కుతోంది. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకున్న భారీ వర్షాల ప్రభావంతో తుంగభద్ర డ్యామ్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో జలాశయం పూర్తిగా నిండి పోటెత్తడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయం నీటి మట్టాన్ని నియంత్రించేందుకు అధికారులు మొత్తం 12 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
ఇన్ఫ్లో, అవుట్ఫ్లో వివరాలు
అధికారుల వివరాల ప్రకారం, తుంగభద్ర డ్యామ్ (Tungabhadra Dam) ఎగువనుంచి 31,261 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీని ప్రభావంతో 35,100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అదనంగా, తుంగభద్ర ప్రాజెక్ట్కు అనుబంధంగా ఉన్న వివిధ కాల్వల ద్వారా మరో 4,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీటితో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలోని పలు తాగునీటి ప్రాజెక్టులకు, సాగునీటి అవసరాలకు తగినంత సరఫరా జరుగుతోంది.
ప్రాజెక్టు పరిసరాల్లో ప్రజలకు అప్రమత్తత సూచన
వరద ఉధృతి నేపథ్యంలో జలాశయం పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. డ్యామ్ గేట్లు తెరిచిన కారణంగా నది పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున, ప్రజలు ఆహుతులు కాకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. సాగునీటి కోసం తుంగభద్రపై ఆధారపడే రైతులకు ఇది అనుకూల పరిణామంగా మారనుంది. అయితే, నీటి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం 24 గంటల పర్యవేక్షణ కొనసాగిస్తోంది.
Read Also : AI Effect : AI దెబ్బకు ఈ ఏడాదిలో లక్ష ఉద్యోగాలు హాంఫట్!