తెలంగాణలో పదో తరగతి పరీక్ష పత్రం లీక్ కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నల్గొండ జిల్లా నకిరేకల్ లో జరిగిన ఈ ఘటన విద్యా వ్యవస్థపై అనేక అనుమానాలను కలిగించింది. ఈ ఘటనలో ఓ విద్యార్థినిని డిబార్ చేసిన అధికారులు, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ ను విధుల నుంచి తొలగించారు. అయితే, పేపర్ లీక్ కేసులో తాను ఎలాంటి తప్పు చేయలేదని బాధిత విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది.

పరీక్షా కేంద్రంలో విద్యార్థినిపై బెదిరింపు
పరీక్షా కేంద్రంలో కిటికీ పక్కన కూర్చున్న విద్యార్థిని ప్రశ్నాపత్రం చూడాలని ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. తనను ఇద్దరు యువకులు బెదిరించారని, ప్రశ్నాపత్రం చూపించకపోతే రాయితో కొడతామని హెచ్చరించారని విద్యార్థిని చెప్పింది. ఆ సమయంలో భయపడిపోయి ఏం చేయాలో తెలియక పేపర్ చూపించానని తెలిపింది. ఫొటో తీసుకున్న యువకులు అక్కడి నుంచి తప్పించుకున్నారని వివరించింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం నకిరేకల్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పరీక్షా కేంద్రానికి గోడ దూకి కొంతమంది వ్యక్తులు ప్రవేశించి, ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసుకుని వెళ్లారు. ఆపై సమాధానాలు వెతికి జిరాక్స్ తీయించి పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అందించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఈ ఘటనను గమనించి, వారు పంపిన సమాచారాన్ని ట్రాక్ చేసి, నిందితులను గుర్తించారు. ఎంఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు 11 మందిపై కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు 6 మందిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పరీక్షా పత్రం లీక్ వ్యవహారం విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రభుత్వం దీనిపై దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ ఘటన మరింత దర్యాప్తుకు దారితీసే అవకాశముంది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారుల నుంచి కఠిన హెచ్చరికలు వచ్చాయి. పేపర్ లీక్ వంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరీక్షల సమయాల్లో మరింత భద్రత పెంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ ఘటనతో నిష్కల్మషమైన విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఈ ఘటన వల్ల తాము అనవసరంగా బాధితులమవుతున్నామని వారు అంటున్నారు. నకిరేకల్ ఘటనపై త్వరగా న్యాయం చేయాలని బాధిత విద్యార్థులు కోరుతున్నారు. తెలంగాణలో పరీక్షా పత్రం లీక్ ఘటన విద్యా వ్యవస్థలో భద్రతపై ప్రశ్నలు లేపింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అధికారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పేపర్ లీక్ కేసును వేగంగా ఛేదించి, దోషులను శిక్షించడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ అధికారులు, విద్యా సంస్థలు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.