దాయాది పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వద్ద కవ్వింపు చర్యలకు దిగింది. పూంఛ్ జిల్లాలో కృష్ణ ఘాటి సెక్టార్లో భారత పోస్ట్లపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడటంతో ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. పాక్ దుశ్చర్యను సమర్థంగా తిప్పికొట్టంతో దాయాది సైన్యం వెనక్కి తగ్గి.. తోకముడుచుకుని పారిపోయింది. నాలుగేళ్ల కిందట ఫిబ్రవరి 25, 2021న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పటి నుంచి సరిహద్దుల్లో దాడులు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించడం ఇదే మొదటిసారి.
భారత సైన్యం ధీటైన బదులిచ్చింది
తాజా పరిణామాలతో సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు పెరిగడంతో భారత సైన్యం నిఘాను పటిష్టం చేసింది. దాయాది సైన్యానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సరిహద్దులకు అదనపు బలగాలను తరలిస్తోంది. భారత సైనికులే లక్ష్యంగా కంచె దగ్గర ఐఈడీని అమర్చినట్టు సైనికలు వర్గాలు తెలిపాయి. బుధవారం పూంచ్ సెక్టార్లో ల్యాండ్మైన్ పేలుడు చోటుచేసుకుని ఒక సైనికుడు గాయపడ్డాడని వర్గాలు పేర్కొన్నారు.. తార్కుండి ప్రాంతంలోని ఫార్వర్డ్ పోస్ట్పై.. పాక్ ఆర్మీ జరిపిన కాల్పులను భారత బలగాలు సమర్ధంగా తిప్పికొట్టాయి. తాజాగా, పాక్ ఆర్మీ దుశ్చర్యకు ప్రతిగా భారత సైన్యం బదులిచ్చి దాయాదికి భారీ నష్టం కలిగించింది. అటువైపు పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.

చొరబాటుకు యత్నం
మరోవైపు, గతవారం భారత్ ఫార్వర్డ్ పోస్టుపై దాడికి యత్నించిన ఏడుగురు చొరబాటుదారులను సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. కాల్పుల్లో హతమైన వారిలో ఇద్దరు లేదా ముగ్గురు పాక్ సైన్యానికి చెందిన జవాన్లు ఉన్నారని భావిస్తున్నట్లు సైనిక వర్గాలు వెల్లడించారు. నలుగురు అల్-బదర్ ఉగ్రవాద సంస్థకు ముష్కరులుగా అనుమానిస్తున్నారు. పూంచ్ జిల్లాలో ఫిబ్రవరి 5 మంగళవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత చొరబాటుకు అనుమానితు ఉగ్రవాదు యత్నించారు. వారి కదలికలను గుర్తించిన భారత సైన్యం.. మెరుపువేగంతో స్పందించింది. అనుమానితులపై కాల్పులు జరిపి వారిని మట్టుబెట్టింది.
సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు
- భారత సైన్యం నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది
- సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించింది
- భారత సైనికులపై పాక్ ఐఈడీ అమర్చినట్లు నివేదికలు
- ల్యాండ్మైన్ పేలుడులో ఒక భారత జవాన్ గాయపడిన ఘటన
గత వారంలోనే పాక్ చొరబాటుదారుల ప్రయత్నం విఫలం
- ఫిబ్రవరి 5న భారత సైన్యం ఏడుగురు చొరబాటుదారులను మట్టుబెట్టింది
- మృతుల్లో పాక్ సైన్యానికి చెందిన జవాన్లు ఉన్నట్లు అనుమానం
- నలుగురు అల్-బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు
- బోర్డర్ యాక్షన్ టీమ్ (BAT) హస్తం ఉన్నట్లు అంచనా