సంధ్య థియేటర్ ఘటన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోలు మరియు స్పెషల్ షోలను రద్దు చేసింది.ఈ విషయంపై సినిమాటోగ్రఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి అధికారిక ప్రకటన చేయడం గమనార్హం.అయితే, ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ పరిస్థితుల్లో తన గేమ్ చేంజర్ సినిమాకి బెనిఫిట్ షోలు నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి అనుమతి పొందడమే దిల్ రాజు లక్ష్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.దిల్ రాజు ప్రస్తుతం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ (TFDC) చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బాధ్యతను దిల్ రాజుకు అప్పగించడం టాలీవుడ్కు ప్రభుత్వ మద్దతు మెరుగుపడేందుకు కారణమైంది.ఈ కార్పొరేషన్ ద్వారా టాలీవుడ్ సమస్యలను ప్రభుత్వం ఎదుట ప్రవేశపెట్టడంలో దిల్ రాజు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ కోసం అదనపు షోలు, థియేటర్ల సంఖ్య పెంచడం,టికెట్ రేట్ల సమస్యలను సైతం పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ప్రభుత్వంతో ఉన్న తన సంబంధాలను ఉపయోగించి, ఈ విషయంలో అనుకూల నిర్ణయం తీసుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. గేమ్ చేంజర్ పట్ల దిల్ రాజు చాలా నమ్మకంగా ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఈ సినిమా బెనిఫిట్ షోలను ప్లాన్ చేస్తోన్నారు.దీనితో పాటు సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మరో రెండు చిత్రాలు కూడా ఆయన హోమ్ బ్యానర్ నుండి రావడం విశేషం. దిల్ రాజు మాట్లాడుతూ, “ఈ సంక్రాంతికి మా బ్యానర్ నుండి మూడు సినిమాలు విడుదల అవుతున్నాయి. వీటి విజయంపై నాకు ఎంతో నమ్మకం ఉంది. గేమ్ చేంజర్ తో పాటు డాకా మహారాజ్ కూడా మా బ్యానర్లోనే ఉన్నాయి,” అంటూ తన ఉత్సాహాన్ని పంచుకున్నారు. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.