

రేవంత్ తో టాలీవుడ్ భేటీ ఆసక్తిని పెంచుతోంది. సంధ్యా థియేటర్ ఘటనతో పాటుగా సినీ పరిశ్రమ సమస్యల పైన ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు సమావేశం జరిగే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. అయితే, అనూహ్యంగా ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరంగా ఉన్నారు. దీంతో, కొత్త చర్చ తెర మీదకు వచ్చింది.
చిరంజీవి గైర్హాజరు సీఎం రేవంత్ తో సమావేశానికి సర్వం సిద్దమైంది. సినీ ప్రముఖులు బంజారాహిల్స్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు. కాగా, ఈ సమావేశం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన చిరంజీవి మాత్రం రాలేదు. మెగా హీరోల్లో వరుణ్ తేజ్ హాజరయ్యారు. అల్లు అరవింద్ .. దిల్ రాజు ఈ టీం ను లీడ్ చేస్తున్నారు. అయితే, చిరంజీవి గైర్హాజరు వెనుక పలు కారణాల పైన చర్చ జరుగుతోంది.
రేవంత్ తో మెగా చర్చలు కాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మాత్రం తొలి నుంచి ఈ వివాదానికి దూరంగా ఉన్నారు. అయితే, ఈ సంక్రాంతికి రాం చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సైతం విడుదల కానుంది. తెలంగాణ ప్రభుత్వం బెనిఫట్ షోలు.. టికెట్ ధరల పెంపు పైన నిర్ణయం వెనక్కు తీసుకోకుంటే నష్టం తప్పదనే అంచనాలు ఉన్నాయి. దీంతో, రేవంత్ ను ఒప్పించి.. ఆ నిర్ణయంలో సడలింపు కోసం దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ భేటీ ఏర్పాటు చేసారు. అయితే, ఈ భేటీ ఏర్పాటుకు తొలి నుంచి పూర్తి ప్రయత్నాలు చేసిన చిరంజీవి ప్రస్తుతం విదేశాలలో ఉన్నారని తెలుస్తుంది. అయితే, రేవంత్ తో ఫోన్ లో మాట్లాడిన సమయంలోనే కీలక అంశాలను ప్రస్తావన చేసినట్లు సమాచారం.