హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సిద్ధమైన ముసాయిదాలో పలు మార్పులను సూచించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామక నిబంధనలపై సీఎం తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు.
తిరుమల ఆలయంతో సమానంగా, యాదగిరిగుట్ట ఆలయం పరిసరాల్లో రాజకీయప్రభావం లేకుండా చూడాలని, ఆలయపవిత్రతకు భంగం కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ధర్మకర్తలమండలి నియామకం అలాగే ఆలయం తరఫున నిర్వహించాల్సిన ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలకు సంబంధించి ముసాయిదా నిబంధనల్లో ముఖ్యమంత్రి పలు మార్పులను సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
![image](https://vaartha.com/wp-content/uploads/2025/01/image-247-1024x576.png.webp)
కాగా, తిరుమల తరహాలో యాదగిరిగుట్టకు ప్రత్యేక బోర్డు ఏర్పాటైతే ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి. ఆలయ అభివృద్ధిలో ప్రభుత్వ జోక్యం ఉండదు. ఆలయానికి వచ్చే నిధులు, కానుకల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. యాదగిరిగుట్ట ఆలయంతో పాటుగా.. అనుబంధ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వంపై ఆధారపడకుండా.. బోర్డు ద్వారానే డెవలప్మెంట్ పనులు చేయనున్నారు. భక్తులకు కూడా మెరుగైన సౌకర్యాలు, నిత్య అన్నదానం వంటివి అందుబాటులోకి వస్తాయి.