హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో విజయశాంతి పేరు ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఆమె స్పందించారు. ఉద్యమ కారులకు సంతోషంగా ఉంది. 28 ఏండ్లు తెలంగాణ కోసం కొట్లాడాము. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషం. సోనియా గాంధీకి కృతజ్ఞత చెప్పాలి అని విజయశాంతి అన్నారు. అలాగే హైకమాండ్ నాకు అవకాశం ఇచ్చింది. ఇక నుండి ప్రతిపక్షం ఆటలు చెల్లవు అన్నారు.

అందుకే ఓపిక పట్టిన
గత 10 ఏళ్లలో ఖజానా ఖాళీ చేశారు. సీఎం కింద మీద పడి ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ కి ఎక్కువ పని చేసింది నేనే. 2023 లో నాకు ఎమ్మెల్సీ ఇస్తామని హైకమాండ్ చెప్పింది. ఆ తర్వాత నేను అడగలేదు. అయితే పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఎవరికి ఏ బాధ్యత ఇస్తుందో తెలియదు. అందుకే ఓపిక పట్టిన. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఉద్యమ కారులం మేమంతా. కాబట్టి మమల్ని గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు
పార్టీ అధిష్ఠానం తనకు ఏ అవకాశం ఇచ్చినా తనకు పదవుల వంటివి వద్దని, తాను ముందు పనిచేస్తానని చెప్పానని విజయశాంతి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు తాను మళ్లీ కాంగ్రెస్లోకి వచ్చానని చెప్పారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్తో పాటు విజయశాంతికి ఆ పార్టీ అధిష్ఠానం టికెట్లు ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.