కాంగ్రెస్ అగ్రనేత, రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ మరోసారి ఆసుపత్రిలో చేరారు. గురువారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆమెను న్యూఢిల్లీలోని సర్ గాంగారమ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సోనియా గాంధీకి కడుపులో నొప్పి రావడంతో గురువారం ఉదయం 8.30 గంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చారని పేర్కొన్నాయి. తమ నాయకురాలు ఆసుపత్రిలో చేరడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులుగా అస్వస్థతకు గురైన ఆమె, పొత్తికడుపు సంబంధిత సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని, ప్రస్తుతం నిలకడగా ఉందని గంగారామ్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

గత డిసెంబరులోనూ సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా కర్ణాటకలోని బెళగావిలో ‘నవ సత్యాగ్రహ బైఠక్’ పేరుతో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలకు ఆమె హాజరుకాలేదు. అంతకు ముందు కూడా ఆమె పలుసార్లు అనారోగ్యంతో సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం సోనియా గాంధీ వయసు 78 ఏళ్లు కాగా గతంలో ఆమె కేన్సర్ బారినపడి కోలుకున్నారు.ఇక, 2016లో వారణాసి రోడ్డుషోలో పాల్గొన్న ఆమె అస్వస్థతకు గురై పడిపోయారు. దీంతో హుటాహుటిన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి ఆమెకు తరలించారు. అక్కడ నుంచి సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కొద్ది రోజుల ఐసీయూలో చికిత్స తర్వాత కోలుకున్నారు.
రాజకీయ బాధ్యతల నుంచి విరమణ
గత ఏడాది, 78వ ఏట అడుగుపెట్టిన సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈసారిలోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా, రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆమె కుమార్తె ప్రియాంకా గాంధీ రాజకీయాల్లో మరింత క్రియాశీలంగా మారి, వయనాడ్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
సోనియా గాంధీ ఆరోగ్యం మెరుగుపడిన వార్తతో కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకం నెలకొంది. ఆమె త్వరగా కోలుకోవాలని అనేక మంది కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు.