భారత రహస్య సమాచారం, రక్షణ రంగానికి సంబంధించిన కీలక డేటాను దొంగిలించేందుకు.. తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే అలాంటి ప్రయత్నాలు విఫలమై దొరికిపోతున్నాయి. భారత్లోని పలు రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను టార్గెట్గా చేసుకుని పాక్ గూఢచార సంస్థ-ఐఎస్ఐ.. మహిళలను ఎరగా వేసి.. వారి నుంచి కీలక డేటాను రాబడుతూ ఉంటోంది. ఇలాంటి ఘటనలు ఎప్పటినుంచో జరుగుతున్నా.. కొందరు ఉద్యోగులు మహిళల కోసం సమాచారాన్ని లీక్ చేస్తున్నారు. తాజాగా రాజస్థాన్లోని ఓ రైల్వే ఉద్యోగి.. పాక్ మహిళ హనీట్రాప్లో పడి.. ఆర్మీకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని చేరవేసినట్లు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ రైల్వే ఉద్యోగిని అరెస్ట్ చేసి వివరాలు సేకరిస్తున్నారు.

పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్
రాజస్థాన్ బికనీర్ జిల్లా భవానీ సింగ్ అనే వ్యక్తి రైల్వేలో పాయింట్ మెన్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే భవానీ సింగ్కు సోషల్ మీడియా ద్వారా పాక్ మహిళ నిమ్మి పరిచయం అయింది. అయితే ఆమె పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ అని గుర్తించలేని భవానీ సింగ్.. ఆమె అడిగిన సమాచారాన్ని అందించినట్లు తేల్చారు. బికనీర్లోని ఆర్మీ కార్యకలాపాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని నిమ్మి అనే పాక్ మహిళా ఏజెంట్కు అందించాడని.. అందుకు ప్రతిఫలంగా డబ్బు పొందినట్లు గుర్తించారు.
భవానీ సింగ్ అరెస్ట్
అయితే పాకిస్తానీ మహిళ, పాక్ గూఢచార సంస్థ హనీ ట్రాప్లో చిక్కుకున్న భవానీ సింగ్ను రాజస్థాన్కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు.. అరెస్ట్ చేశారు. ఇక రాజస్థాన్లో పాకిస్తాన్ కార్యకలాపాలపై నిఘా ఉంచిన ఇంటెలిజెన్స్ వర్గాలు.. తమ నిఘాలో నిమ్మీ అనే పాకిస్తానీ మహిళకు భవానీ సింగ్ చేసిన కాల్స్ను గుర్తించాయి. దీంతో అతడిని అరెస్ట్ చేశారు. ఇక భవానీ సింగ్పై నిఘా ఉంచిన అధికారులు.. మహాజన్ రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ జరిపి అరెస్ట్ చేశారు. అయితే గతేడాది ఫిబ్రవరిలో కూడా రాజస్థాన్లో ఓ వ్యక్తిని పాక్ ఐఎస్ఐ హనీట్రాప్లో పడేయగా.. అతడిని గుర్తించి అధికారులు అరెస్ట్ చేశారు. 2024 ఫిబ్రవరిలో మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో క్యాంటీన్ నడుపుతున్న విక్రమ్ సింగ్ అనే వ్యక్తి.. పాకిస్తాన్ మహిళలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.