సీనియర్ నటీమణి, ప్రముఖ నిర్మాత, స్టూడియో అధినేత శ్రీమతి మీర్జాపురం కృష్ణవేణి (101) ఇకలేరు. ఫిబ్రవరి 16, ఆదివారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు.‘సతీ అనసూయ’ అనే సినిమాలో 1936లో సినిమా రంగానికి పరిచయం అయ్యారు. బాల నటిగా కొనసాగుతూనే తెలుగు, తమిళ భాషా చిత్రాలలో నటించి మెప్పించారు. హీరోయిన్గా ఉన్న టైమ్ లోనే మీర్జాపురం రాజా వారితో పరిచయం ఏర్పడి, ప్రేమగా మారి, వివాహా బంధంగా మారింది.1949లో ‘మనదేశం’ అనే సినిమాలో నందమూరి తారక రామారావును తెలుగు సినిమా రంగానికి పరిచయం చేశారు కృష్ణవేణి. ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మీర్జాపురం రాజా, మేక రంగయ్య వంటి చిత్రాలను ఆమె నిర్మించారు.కృష్ణవేణి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు. నేటి ఉదయం కృష్ణవేణి తుది శ్వాస విడిచినట్లు ఆమె కూతురు అనురాధ తెలిపారు.2004లో రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి నటజీవితానికి తొలుత అవకాశం అందించిన శ్రీమతి కృష్ణవేణి గారిని ఇటీవల ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక, అంతకు ముందు ఎన్టీఆర్ సెంటినరీ సెలబ్రేషన్స్ సందర్భంగా శ్రీమతి కృష్ణవేణి గారిని ఘనంగా సత్కరించడం జరిగిందని బాలయ్య గుర్తు చేసుకున్నాడు.
తెలుగు చిత్రసీమలో మహిళా శక్తికి ఆదర్శంగా:
తెలుగు చిత్రసీమలో మహిళా నిర్మాతగా నిలదొక్కుకుని, స్టూడియో అధినేతగా తనదైన ముద్రవేసిన కృష్ణవేణి, నాటి మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఆమె చూపిన మార్గదర్శకత్వం, సినీ పరిశ్రమకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.సీనియర్ నటీమణి, నిర్మాతగా తనదైన ముద్ర వేసిన మీర్జాపురం కృష్ణవేణి గారి ఆత్మకు శాంతి కలగాలని సినీ ప్రముఖులు, అభిమానులు ప్రార్థిస్తున్నారు.

సినీ పరిశ్రమలో తీరనిలోటు:
మీర్జాపురం కృష్ణవేణి మృతి పట్ల సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, ఎన్టీఆర్ సినీ ప్రస్థానానికి తొలి అవకాశం ఇచ్చిన మహనీయురాలైన కృష్ణవేణి గారి మరణం పట్ల నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు.‘‘కృష్ణవేణి గారి మృతి తెలుగుతెరకు తీరని లోటు. ఇటీవల ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుకల్లో, ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ఆమెను ఘనంగా సత్కరించడం సంతోషకరమైన విషయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’’ అంటూ బాలయ్య ప్రెస్ నోట్ విడుదల చేశారు.
చంద్రబాబు సంతాపం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణవేణి మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని, తెలుగు సినిమా ఉనికిని పెంచిన గొప్ప వ్యక్తిగా కీర్తించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.