సర్వైకల్ క్యాన్సర్ నుంచి మహిళలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్- 2025లో చారిత్రక నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నేషనల్ ఇమ్మునైజేషన్ ప్రోగ్రాం పరిధిలోకి ఈ క్యాన్సర్ ను తీసుకొచ్చేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సమాయత్తం అవుతున్నట్లు సమచారం అందుతోంది. ఈ బడ్జెట్ లోనే ఈ విధానానికి సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సర్వైకల్ క్యాన్సర్ టీకా కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించనుందని గతేడాది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎంతో మంది మహిళలను వేధిస్తోన్న సమస్య సర్వైకల్ క్యాన్సర్. దీనిపై అవగాహన లేకపోవడం వల్ల చిన్నవయసులోనే విద్యార్థినులు, మహిళలు ఈ క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఉచితంగా టీకా.. సర్వైకల్ క్యాన్సర్ టీకా ప్రస్తుతం కేవలం ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే అందుబాటులో ఉంది. ఒక్కో డోసు ధర రూ. 4000 గా ఉంది. అయితే విద్యార్థినులు, మహిళల కోసం ఈ టీకాను ఉచితంగానే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ టీకా కార్యక్రమం కోసం ఈ బడ్జెట్ లోనే ప్రత్యేకంగా నిధులు కేటాయించనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ టీకాను ప్రస్తుతం చిన్నారుల కోసం తీసుకొచ్చిన నేషనల్ ఇమ్మునైజేషన్ ప్రోగ్రాంలో విలీనం చేసి.. విద్యార్థినులు, మహిళలు కోసం అందుబాటులోకి తీసుకురానున్న యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది.
HPV vaccine: సర్వైకల్ క్యాన్సర్ లేదా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది ప్రస్తుతం దేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. హ్యూమన్ పాపిలోమా వైరస్(HPV)కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. ఇది శరీరంలోకి ప్రవేశించాక క్యాన్సర్ గా మారేందుకు 15-20 ఏళ్లు పడుతోంది.ఎక్కువమంది భాగస్వాములతో లైంగిక చర్యలో పాల్గొనడం, వంశపారంపర్యం, గర్భనిరోధక మందులు అధికంగా వాడటం, ధూమపానం.. తదితర కారణాల వల్ల ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంది.