తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. సిబ్బంది శిక్షణపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 15లోగా వారికి శిక్షణ పూర్తి చేయాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా తొలుత ZPTC, MPTC ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈనెల చివరి వారంలో నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మెుదలైంది. అందుకే ఇక ఆలస్యం లేకుండా సర్పంచ్ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. పల్లెల్లో సర్పంచ్, ఎంపీటీసీగా పోటీ చేసే ఆశావాహులు ప్రచారాన్ని మెుదలుపెట్టారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డే్ట్ వచ్చింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ల ఎన్నికల కోసం అధికారులు, సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలని ఉత్తర్వులిచ్చింది. ఈనెల 15 లోగా శిక్షణ ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ నెల 4, 5 తేదీల్లో హైదరాబాద్లో ఎంపిక చేసిన అధికారులకు మాస్టర్ ట్రైనర్ల శిక్షణ పూర్తయింది. వారితో అన్ని జిల్లాల్లోని ఎన్నికల సిబ్బందికి వెంటనే శిక్షణ ప్రారంభించి ఈనెల 12లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం సూచించింది. ఇక ఎన్నికల ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఈనెల 15లోపు పూర్తి చేయాలని డెడ్లైన్ విధించింది. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం అన్ని జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల ఎంపిక ప్రక్రియ కూడా ఈనెల 15లోగానే పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు మరో ఉత్తర్వును జారీ చేసింది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. తాజాగా MPTC, ZPTC ఎన్నికల నిర్వహణకు సైతం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ నెల 11న ముసాయిదా కేంద్రాలను గుర్తించాలి. అదే రోజు వాటి జాబితాను ఆయా మండల పరిషత్ల పరిధిలో ప్రదర్శించాలి. అందులో ఏమైనా అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 13 వరకు స్వీకరించి, 14న పరిష్కరించాలి. అదేరోజు జిల్లా కలెక్టర్లకు తుది ఎంపిక జాబితాను అందజేయాలి. ఈ నెల 10లోగా ముసాయిదా సిద్ధం చేయాలని ఆదేశించింది.