ప్రస్తుతం సమాజంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం పేరుతో సామాన్యులను ఆర్థికంగా దోచుకుంటున్నారు.అవకాశం దొరికినా సైబర్ క్రిమినల్స్ దోపిడీకి తెగబడుతున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇందిరమ్మ ఇంటికి ఎంపికయ్యారు డబ్బులు కట్టాలి అంటూ ఫోన్ కాల్స్ చేస్తూ అమాయక ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు.ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు చేసుకున్న వారికి ఫోన్ కాల్స్ చేస్తూ మీరు ఇందిరమ్మ ఇల్లుకు అప్లికేషన్ చేసుకున్నారు కదా మీ పేరు ఎంపిక అయ్యింది. మీరు డబ్బులు కట్టాలి అని చెబుతూ లబ్ధిదారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఫోన్ చేసి మీరు డబ్బులు కడితేనే మీకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని లేదంటే రాదని చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు.ఇందిరమ్మ ఇళ్ళకు డబ్బులు కట్టాలని ఫేక్ కాల్స్ వస్తున్న తరుణంలో,ప్రభుత్వం స్పందించింది .ఎవరు ఎవరికి ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, మధ్య దళారులను నమ్మవద్దని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అయితే ఇందిరమ్మ ఇంటికి ఎంపికైన వాళ్ళు డబ్బులు కట్టాలని ఫోన్ కాల్స్ వస్తుండడంతో అవి నిజమైన ఫోన్ కాల్స్ (లేదా )ఫేక్ ఫోన్ కాల్స్ వస్తున్నాయా అర్ధం కాక లబ్ధిదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఇక ఈ విషయాన్ని అధికారులు మరియు పోలీసుల దృష్టికి తీసుకు వెళుతున్నారు. ఈ ఫోన్ కాల్స్ పై పోలీసులు స్పందించారు. ఇందిరమ్మ ఇంటికి డబ్బులు కట్టాలని ఎటువంటి ఫోన్ కాల్స్ ప్రభుత్వం నుంచి రావడంలేదని, ఎవరు పొరపాటున కూడా ఈ ఫోన్ కాల్స్ కు స్పందించవద్దని చెబుతున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న పథకాల విషయంలో కూడా సైబర్ నేరగాళ్లు ఫ్రాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సైబర్ క్రిమినల్స్ ఆట కట్టించడానికి రంగంలోకి దిగిన పోలీసులు వారిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

అధికారుల హెచ్చరిక
తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే అది మోసమని గుర్తించాలని సూచించారు. అలాంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే సైబర్ క్రైమ్ నెంబర్ 1930 లేదా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
ప్రజలు గమనించాల్సిన ముఖ్య అంశాలు
ఏదైనా సందేహం ఉంటే సంబంధిత స్థానిక అధికారులను సంప్రదించాలి.
ఫోన్ ద్వారా బ్యాంక్ వివరాలు, ఓటీపీ, వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వకూడదు.
గుర్తు తెలియని వ్యక్తుల ఖాతాల్లో డబ్బులు బదిలీ చేయడం పక్కన పెట్టాలి.
అవగాహన పెంచుకోవాలి
సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, లింక్లు నమ్మకూడదు. వాస్తవాలను తెలుసుకున్న తరువాతే ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేపట్టాలి. అప్రమత్తతే మీ డబ్బును, భవిష్యత్తును కాపాడుతుందని గుర్తించాలి.