రోహ్తక్ : హరియాణాకు చెందిన యువ కాంగ్రెస్ నేత హిమానీ నర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దుండగులు ఆమెను మార్చి 1న హత్య చేసి, మృతదేహాన్ని సూట్ కేసులో కుక్కి రోహ్తక్-ఢిల్లీ హైవేపై పడేశారు. ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకోవడానికి పోలీసులు సిట్ను ఏర్పాటుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందులోభాగంగా ఒక నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. కాగా, ఆ వ్యక్తి తానే హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు
నిందితుడితో హిమానీకి పరిచయం ఉన్నట్లు గుర్తించామన్నారు. కాగా హత్యకు గల కారణాలు, నిందితుడికి ఎవరైనా సహకరించారా అన్న వివరాలు తెలియాల్సి ఉందన్నారు. రోహ్తక్, రోహద్ టోల్ ప్లాజాల మధ్య 25 కిలోమీటర్ల మేర ఉన్న జాతీయరహదారి పక్కన ఉన్న హోటళ్లు, దుకాణాల వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా ఆమె పాల్గొన్న కార్యక్రమాలు, కలిసిన వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నామన్నారు. ఫిబ్రవరి 27 మధ్యాహ్నం వరకు తాను తన కుమార్తెతో ఉండి..అదే రోజు సాయంత్రం ఢిల్లీలో ఉన్న తన కుమారుడి వద్దకు వెళ్లినట్లు హిమానీ తల్లి సవిత పేర్కొన్నారు.
తన కూతురు రాజకీయంగా ఎదుగుతుండడం చూసి ఓర్వలేక
28న ఖాట్మండులో జరగనున్న కాంగ్రెస్ రోడ్షోకి తాను హాజరు కావాల్సిఉందని చెప్పిందని తెలిపారు. అనంతరం 28న మరోసారి తనతో మాట్లాడుతూ.. తన ఫోన్ స్విచ్ఆఫ్ అయ్యేలా ఉందన్నట్లు చెప్పారు. తన కూతురు రాజకీయంగా ఎదుగుతుండడం చూసి సొంత పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఓర్వలేకపోయారని అన్నారు. రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత భూపిందర్ హుడా కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. దీనిని తట్టుకోలేని పార్టీ నాయకులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని మృతురాలి తల్లి ఆరోపించారు. తన కుమార్తెను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసే వరకు ఆమె అంత్యక్రియలు నిర్వహించమని వెల్లడించారు.