పార్లమెంట్ ఉభయ సభల్లో ఇటీవల ఆమోదం పొందిన వక్ఫ్ బిల్లు–2025 ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ మరియు ఎంఐఎం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ముస్లింల ఆస్తుల పరిరక్షణ పేరిట తెచ్చిన ఈ బిల్లు వాస్తవంగా వారి హక్కులను హరించేదిగా ఉందని ఆ పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీంతో ఈ బిల్లుపై సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
సుప్రీంకోర్టులో కాంగ్రెస్, ఎంఐఎం పిటిషన్
వక్ఫ్ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడుతూ కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ బిల్లులోని కొన్నిప్రావిధానాలు ముస్లిం మైనారిటీలకు న్యాయం చేయడంలో విఫలమవుతాయని, వారి మౌలిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై ప్రభుత్వ నియంత్రణ పెరగడం మత స్వాతంత్ర్యానికి విఘాతమని వారు వాదిస్తున్నారు.

ఒవైసీ విమర్శల పట్టు
ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఈ బిల్లుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వక్ఫ్ బిల్లులో ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఖండించే విధంగా నిబంధనలు ఉండడం రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వం పరిపాలన హక్కును పొందడం మతరహిత రాజ్యంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆయన తెలిపారు. ఈ అంశాన్ని తక్షణమే పరిశీలించి సుప్రీంకోర్టు తగిన తీర్పు ఇవ్వాలని కోరారు.
బిల్లుపై రాజకీయ, చట్టపరమైన ప్రభావం
వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్, ఎంఐఎం లు సవాలు చేయడంతో ఇది రాజకీయంగా, చట్టపరంగా పెద్ద చర్చకు దారి తీసే అవకాశం ఉంది. ముస్లిం మైనారిటీ సమాజం హక్కులను కాపాడటంలో ఈ బిల్లు ఎంతవరకు న్యాయం చేస్తుందనే అంశంపై వివిధ వర్గాలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక సుప్రీంకోర్టు విచారణలో ఈ బిల్లుపై ఏమేరకు రాజ్యాంగబద్ధత ఉందన్న విషయంపై తుది తీర్పు వెలువడే వరకు దేశ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్గా నిలిచే అవకాశం ఉంది.