స్థానిక ఎన్నికలకు ముమ్మర కసరత్తు..
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష సమావేశం ప్రారంభమైంది. రిజర్వేషన్లు, ఎన్నికల సన్నాహాలపై డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు సీతక్క, ఉత్తమ్, సీఎస్ శాంతికుమారి, కలెక్టర్లు ఇతర అధికారులకు ఆయన వివరించనున్నారు. మరోవైపు ఎన్నికలు ఏకగ్రీవం కాకుండా నిర్వహించాలని రాజకీయ పార్టీలతో ఈసీ చర్చించనుంది.

ప్రధానంగా ఈసారి జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల్లో నోటా ఉండాలా వద్దా అన్నది నేడు సమావేశంలో చర్చించనున్నారు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో వార్డు సభ్యులనేవి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నాయి. ఒకరే పోటీలో ఉన్నప్పుడు ఏకగ్రీవంగా ప్రకటించాలా? ఒకరితో పాటు నోటాన కూడా పెట్టి పోలింగ్ నిర్వహించాలా? అనే అంశంపై చర్చించనున్నారు. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు నిర్దేశాల ప్రకారం కచ్చితంగా నోటా అనేది ఉండాలి అన్నది కొన్ని సంఘాలు, సామాజికవేత్తలు చెబుతున్నారు.
కాబట్టి నోటా పెడితే ఏకగ్రీవం అయినా పోలింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే నోటా ఉండాలా వద్దా అన్నది రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని ఎన్నికల సంఘం తీసుకోనున్నది. ఇప్పటికే దీనిపై అభిప్రాయాలు తెలుపాలని నవంబర్లోనే ఎన్నికల సంఘం అన్నిపార్టీలకు లేఖ రాసింది. అయితే పార్టీల నుంచి స్పందన రాకపోవడంతో నేడు నేరుగా సమావేశం నిర్వహించాలని నిర్ణయించిది.