నాగర్కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద జరిగిన SLBC టన్నెల్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈనెల 22న టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. ప్రమాదం జరిగి మూడు రోజులు గడుస్తున్నా, వారి ఆచూకీ తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. సహాయ చర్యల కోసం ఆర్మీ, ఎన్టీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ సహా నిపుణుల బృందాలు రంగంలోకి దిగినా, ఇప్పటి వరకు వారు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. ప్రభుత్వ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ప్రమాద స్థలాన్ని సందర్శించనున్న బీఆర్ఎస్ నేతలు
ఈ ఘటనపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, SLBC ఘటన చాలా దురదృష్టకరమని, కార్మికులు సురక్షితంగా బయటకు రావాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో గురువారం బీఆర్ఎస్ నేతలు ప్రమాద స్థలాన్ని సందర్శించనున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే, వారి పర్యటనను అడ్డుకోవద్దని పోలీసులను కోరారు. అదేవిధంగా, ప్రభుత్వం సహాయక చర్యలపై కాకుండా, గత ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నించడం బాధాకరమని హరీష్ రావు విమర్శించారు. కాళేశ్వరంలో చిన్న ప్రమాదం జరిగినప్పుడు NDSA బృందం వెంటనే స్పందించిందని, SLBC విషయంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించారు.
ప్రమాదంపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
SLBC ప్రమాదంపై బీఆర్ఎస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, టన్నెల్ ప్రమాదంపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని సూచించారు. ప్రమాదానికి బాధ్యులైన వారిపై తక్షణమే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. కార్మికుల ప్రాణాలకు ఎలాంటి హాని లేకుండా వారికి తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం సమర్థంగా స్పందించాలని కేటీఆర్ కోరారు.