నేడు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన చేయనున్న సీఎం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకురానుంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌కు సీఎం రేవంత్‌రెడ్డి మధ్యాహ్నం 2 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. దీనిలో భాగంగా ఈరోజు 28 స్కూళ్లకు ఒకేసారి శంకుస్థాపన జరగనుంది.

ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో శంకుస్థాపన కార్యక్రమాలు జరగనున్నాయి. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేయనున్నారు. నల్గొంండ, దేవరకద్ర, జడ్చర్లలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారు. ఇప్పటికే వీటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5వేల కోట్లు కేటాయించగా ఒక్కో స్కూల్ నిర్మాణానికి రూ.26 కోట్లు వెచ్చించనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలు ఉన్నాయి. అన్నింటినీ కలిపి ఒకే చోట సమీకృత సముదాయంగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 100 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు రూ.12 వేల కోట్లతో వీటిని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రచించింది. మొదటి విడతలో స్థలాలు అందుబాటులో ఉన్న కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్‌నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పర్కాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాలను ఎంపిక చేశారు.

మిగతా నియోజకవర్గాల్లోనూ స్థలాలను గుర్తించాలని అధికారులను ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ఈ స్కూళ్లను నిర్మించనుంది. సుమారు 20 నుంచి 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించనున్నారు. ఒక్కో పాఠశాల సముదాయానికి సుమారు రూ.100 నుంచి రూ.125 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ ఏడాది రూ.5 వేల కోట్లతో గురుకుల సముదాయాల నిర్మాణం ప్రారంభిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లన్నీ ఒకే డిజైన్‌లో నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళిక చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. సౌర, వాయు విద్యుత్​ను వినియోగించేలా, వాన నీటిని సంరక్షించేలా డిజైన్ చేశారు. పన్నెండో తరగతి వరకు సుమారు 2 వేల 560 మంది విద్యార్థులు, దాదాపు 120 మంది బోధన సిబ్బందికి సరిపోయేలా క్యాంపస్‌లకు ప్రణాళిక చేశారు. ఒకేసారి 900 మంది విద్యార్థులు తినేలా డైనింగ్ హాల్, డిజిటల్ స్మార్ట్ బోర్డులు, కంప్యూటర్ కేంద్రాలు, గ్రంథాలయాలు, లేబొరేటరీలు, క్రికెట్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ కోర్టులు, అవుట్ డోర్ జిమ్​తో మినీ ఎడ్యుకేషన్ హబ్‌లా ఉండేలా ప్రణాళికలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *