జనవరి మాసంలో అధ్యక్షుడుగా ప్రమాణస్వీకారం చేయనున్న ట్రంప్ తన మంత్రివర్గాన్ని విస్తరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గంలో మరో ఇండియన్ అమెరికన్ కు చోటు దక్కింది. కృత్రిమ మేధకు సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త, టెకీ, రచయిత శ్రీరామ్ కృష్ణన్ ను ట్రంప్ నియమించారు.
ఈమేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో కృష్ణన్ సీనియర్ పాలసీ అడ్వైజర్ గా నియమించినట్లు తెలిపారు. వైట్హౌస్ ఏఐ క్రిప్టో జార్ డేవిడ్ ఒ శాక్స్తో కలిసి ఆయన పనిచేస్తారని అన్నారు.
విండోస్ అజుర్ వ్యవస్థాపక సభ్యుడిగా శ్రీరామ్
కృత్రిమ మేధతో అమెరికన్ నాయకత్వాన్ని మరింత ముందుకుతీసుకెళ్తారని ట్రంప్ వెల్లడించారు. విండోస్ అజుర్ వ్యవస్థాపక సభ్యుడిగా శ్రీరామ్ కృష్ణన్ మైక్రోసాఫ్ట్ లో తన కెరీర్ ను స్టార్ట్ చేశారని ట్రంప్ తెలిపారు. కాగా, దీనిపై ట్రంప్ కు శ్రీరామ్ కృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీరామ్ కృష్ణన్ చెన్నైకి చెందిన వారు.
చెన్నైలోనే పుట్టిపెరిగిన కృష్ణన్.. అన్నా యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసి అమెరికా వెళ్లారు. మైక్రోసాఫ్ట్ లో 2007 లో తన కెరీర్ ప్రారంభించి, ఫేస్బుక్, యాహూ, ట్విటర్, స్నాప్ తదితర సంస్థలలో పనిచేశారు. తన మేధస్సుతో ముందుకు దూసుకెళ్తున్న శ్రీరామ్ కృష్ణన్ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తాడని ట్రంప్ అన్నారు.