చంద్రబాబు కు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు

ఏపీ నూతన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన టిడిపి అధినేత, చంద్రబాబు కు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. ‘చారిత్రాత్మకమైన మెజారిటీతో మిమ్మల్ని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రజల ఆశయాలకు, నమ్మకాలకు అనుగుణంగా, రాష్ట్ర అవసరాలను, కఠిన సవాళ్ళను దృష్టిలో పెట్టుకుని, సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతలను మిళితం చేసి ఇకపై ప్రజారంజక పాలన అందిస్తారని ఆశిస్తున్నాము.

ఈ సందర్భంగా, గడిచిన వారంరోజుల్లో, ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుండీ, అటు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద, ఇటు డా వైఎస్ రాజశేఖర రెడ్డిగారి విగ్రహాల మీద జరుగుతున్న దాడులు మమ్మల్ని ఎంతగానో కలచివేశాయి. వారు చేసారని మీరు, మీరు చేసారని భవిష్యతులో మళ్ళీ వాళ్ళు, ఇలా ఈ పగలకు, ప్రతీకారాలు అంతు ఉండదు, సభ్యసమాజంలో, ప్రజాస్వామ్యంలో వీటికి చోటు లేదు, ఉండకూడదు. ఎన్నో తీవ్రమైన సవాళ్ల మధ్య రాష్ట్ర పునర్నిర్మాణం వేగంగా, నిబద్ధతతో జరగాల్సిన ఈ సమయంలో, ఇటువంటి హేయమైన చర్యలు, దాడులు, శాంతిభద్రతలకు మాత్రమే కాదు, రాష్ట్ర ప్రగతికి, పేరుకు, అందివచ్చే అవకాశాలకు కూడా తీవ్రమైన విఘాతం కలగజేస్తాయని తెలియజేస్తున్నాము.

గడచిన ఐదేండ్లలో జరిగిన విశృంఖల పాలన, దానివలన అన్ని విధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలోపెట్టి ముందుకు తీసుకునివెళతారని ప్రజలు మీకు ఈ తీర్పు ఇచ్చారు. దానికి అనుగుణంగా నడుచుకుని, వైస్సార్ గారి విగ్రహాల మీద దాడులు, ప్రతిపక్షాల మీద ప్రతీకార చర్యలు ఇకపై జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాము. మీకున్న అనుభవముతో, మీరు పెద్దమనసు, నిస్పాక్షికత చూపుతూ, పరిస్థితులను చక్కదిద్దుతారని అనుకుంటున్నాము. ఇటువంటి ప్రతీకార రాజకీయాలు, సంస్కారం, విచక్షణకు తావులేని చేష్టలతో మీ పేరుకు, ప్రతిష్టకు, పాలనకు మచ్చ రాకూడదని కోరుకుంటున్నాము అని లేఖలో పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర ప్రగతి కోసం కాంగ్రెస్ నిర్మాణాత్మకమైన పాత్ర పోషిస్తుందని తెలియజేసుంటున్నాను. ఈ సందర్భంగా, మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో, ప్రజారంజకంగా సర్కారు పాలన సాగేలా చూడటంలో మీరు ప్రత్యేక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నాం. నేడు ప్రమాణ స్వీకారం చేసిన ఇతర మంత్రులందరికీ మా శుభాకాంక్షలు’ అంటూ లేఖలో పేర్కొన్నారు.