రేపు గుంటూరులో పర్యటించనున్న వైఎస్ జగన్
అమరావతి: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు బెంగళూరు నుండి తాడేపల్లికి రానున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టై గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ను రేపు ఆయన పరామర్శించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు యలహంక నివాసం నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి వైఎస్ జగన్ .. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి 3.25 గంటలకు చేరుకుంటారు. 4.05 గంటలకు విమానంలో బయలుదేరి 5.40 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.25 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు.
రేపు (బుధవారం) గుంటూరు వెళ్లి జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పరామర్శిస్తారు. నందిగం సురేశ్ను ఇటీవల టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.