వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సస్పెండ్

వైసీపీ అధినేత జగన్ ఆదేశాలతో కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్దారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైసీపీ ప్రకటించింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఆయన పనిచేసినట్లు ఆరోపణలు రావడంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సులతో సస్పెండ్ చేశారు. ఇటీవలి ఎన్నికల్లో సిద్దారెడ్డికి జగన్ కేటాయించలేదు. మైనార్టీకి ఇవ్వాలన్న ఉద్దేశంతో మక్బూల్ అహ్మద్ అనే నేతకు టిక్కెట్ కేటాయించారు. దీంతో సిద్దారెడ్డి తీవ్ర అసంతృప్తికి గుర్యయారు. ఎన్నికల సమయంలో ఆయనను బుజ్జగించారు. అప్పటికి వైసీపీ విజయం కోసం పని చేస్తానని చెప్పిన ఆయన తర్వాత.. వైసీపీకి వ్యతిరేకంగా పని చేశారన్న ఆరోపణలు వచ్చాయి.

ఈ ఆరోపణలపై అంతర్గత విచారణ చేయించిన జగన్ అది నిజమేనని గుర్తించి.. ఆయనపై వేటు వేస్తూ నిర్ణయంమ తీసుకున్నారు. వైసీపీ అభ్యర్థి మక్బూల్ అహ్మద్ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ చేతిలో ఓటమిపాలయ్యారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు అయిన సిద్దారెడ్డిని అనూహ్యంగా సస్పెండ్ చేయడంపై వైసీపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పని చేసిన వారిలో ఒక్క సిద్దారెడ్డి మాత్రమే కాదని..దాదాపుగా ప్రతీ నియోజకవర్గంలో అలాంటి నేతలు ఉన్నారని అంటున్నారు. అయితే పెద్దగా సమీక్ష ఏమీ చేయకుండానే.. కదిరిలో మాత్రమే సిద్దారెడ్డిని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం ఆ పార్టీలోనే ఆశ్చర్యకరంగా మారింది.