పశ్చిమ బెంగాల్‌లో మెడికల్‌ విద్యార్థిని దారుణ హత్య…

పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ శవమై కనిపించడం కలకలం రేపుతోంది. సెమినార్ హాల్‌లో నగ్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థిని హత్య విషయం తెలుసుకున్న వెంటనే బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హస్పిటల్‌ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. అలాగే పలు పార్టీల నేతలు కూడా మద్దతుగా నిలిచారు. తమ బిడ్డ పై అత్యాచారం చేసి అన్యాయంగా చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ.. బాధితురాలి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

మృతురాలు ఛాతీ మెడిసిన్ విభాగంలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గురువారం రాత్రి విధుల్లో ఉంది. శరీరంపై గాయాల గుర్తులు కనిపించడం తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గురువారం రాత్రి డ్యూటీలో ఉన్న సిబ్బందిని విచారిస్తున్నారు. గత రాత్రి ఆమెతో డ్యూటీలో ఉన్న వైద్యులు, నర్సులు, ఇతరులతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు వెల్లడించారు. రిపోర్టు రాగానే అసలు విషయాలు బయటకు వస్తాయని తెలిపారు. పోస్టుమార్టం చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని పోలీసులు చెపుతున్నారు.