Raj Kasireddy : రాజ్ కసిరెడ్డి (కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి) మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరో ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో సిట్ విచారణకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మద్యం కుంభకోణం కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ గతంలో రాజ్ కసిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం తాజాగా విచారణ చేపట్టింది. మధ్యంతర రక్షణ కల్పించాలంటూ ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, కోర్టు అందుకు సమ్మతించలేదు. తదుపరి విచారణను వారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం తాను విచారణకు హాజరవుతానని రాజ్ కసిరెడ్డి ఆడియో సందేశాన్ని విడుదల చేశారు.

ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ
ఇదే కేసులో ఇటీవల విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరైన తర్వాత కూడా రాజ్ కసిరెడ్డి ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. విజయసాయిరెడ్డి తనపై తీవ్ర ఆరోపణలు చేశారని, ప్రస్తుతం తన బెయిల్ పిటిషన్ కోర్టులో ఉన్నందున తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని అన్నారు. మరోవైపు సిట్ అధికారులు ఇప్పటికే మూడు సార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ.. రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు కాలేదు. తాజాగా న్యాయస్థానంలోనూ అనుకూల తీర్పు రాకపోవడంతో విచారణకు హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Read Also: వంశీ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా