కాంగ్రెస్ బడ్జెట్‌ను ఎందుకు అభినందించాలో చెప్పాలి?: కేటీఆర్‌

Why should Congress budget be appreciated?: KTR
Why should Congress budget be appreciated?: KTR

హైదరాబాద్‌: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈరోజు(బుధవారం) ద్రవ్య వినిమయ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై కేటీఆర్ చర్చను ప్రారంభించారు. బడ్జెట్‌పై తమను ప్రతిపక్షం అభినందిస్తుందని భావించానని భట్టివిక్రమార్క అన్నారని… కానీ ఏం చూసి అభినందించాలో చెప్పాలన్నారు. మన వద్ద రీకాల్ సిస్టం లేదు కాబట్టి తెలంగాణ ప్రజలు నాలుగేళ్ళు ఈ ప్రభుత్వాన్ని భరించాల్సిందేనని… ప్రజలకు ఇక వేరే మార్గం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

నూరు రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పినందుకు అభినందించాలా? డిక్లరేషన్‌లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా? 420 హామీలను తుంగలో తొక్కినందుకు అభినందించాలా? అభినందించడం కాదు అధ్యక్షా… అభిశంసించాలి. మన వద్ద రీకాల్ సిస్టం లేదు కాబట్టి ప్రజల మిమ్మల్ని నాలుగేళ్లు భరించాల్సిందే అన్నారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు.

తెలంగాణ వారికి పాలించే సత్తా ఉందా? అని ఉద్యమం సమయంలో చాలామంది అన్నారని, పదేళ్ల క్రితం నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలంగాణ ఇస్తే ఈ రాష్ట్రం చీకట్లతో నిండిపోతుందన్నారని గుర్తు చేశారు. పదేళ్లలో తెలంగాణ సంపద పెరిగిందని గతంలో చెప్పిన భట్టివిక్రమార్క, అధికారంలోకి వచ్చాక మాత్రం మాట మారుస్తున్నారన్నారు.

2014లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తమకు రూ.369 కోట్ల మిగులుతో తమకు రాష్ట్రాన్ని అప్పగించిందన్నారు. నాడు రెవెన్యూ మిగులు అదే అన్నారు. కానీ 2022-23 నాటికి రెవెన్యూ మిగులు రూ.5,944 కోట్లుగా ఉందన్నారు. ఇక ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్‌లో రెవెన్యూ మిగులు రూ.209 కోట్లు అన్నారు.

రెవెన్యూ మిగులుతో రాష్ట్రాన్ని అప్పగిస్తే అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ విమర్శిస్తోందని, కానీ ఆరోజు మిగులు ఎంతో చూడాలన్నారు. ఇక రూ.5,944 కోట్ల రెవెన్యూ మిగులుతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని అప్పగించామన్నారు. వేతనాలు తెచ్చేందుకు అప్పులు తెచ్చామని చెప్పిన ఆర్థికమంత్రి… బడ్జెట్‌లో మాత్రం మిగలు ఉందని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. దేశ సగటు తలసరి ఆదాయం కంటే తెలంగాణలోని 33 జిల్లాలు ముందున్నాయన్నారు.