కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తన బడ్జెట్ ప్రసంగం ద్వారా తాయిలాలను ప్రకటించటానికి కేవలం మరో 24 గంటలు మాత్రమే మిగిలి ఉంది. అయితే ఈసారి బడ్జెట్లో మోదీ మిత్రపక్షాలకు చెందిన పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాలకు ఎంత మేరకు ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాలను ప్రకటిస్తారనే ప్రశ్న కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. వాస్తవానికి ప్రధాని మోదీ నేతృత్వంలో మూడవసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. దీనికి ముందు కూడా చంద్రబాబు బీజేపీతో కూటమిగా పోటీ చేసి ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంఘతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ రుణం మోదీ తీర్చుకుంటరా, బడ్జెట్లో ఏపీకి నిధుల కేటాయింపుల విషయంలో సముచిత స్థానం ఉంటుందా అనే ప్రశ్నలు కొనసాగుతున్నాయి.
ఎందుకంటే కూటమి పార్టీల డిమాండ్లకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందే. వాస్తవానికి 2024 బడ్జెట్ సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బడ్జెట్లో లక్ష కోట్లు డిమాండ్ చేశారు. నాయుడు అభ్యర్థన రాబోయే బడ్జెట్ కేటాయింపులపై ప్రభావం చూపుతుందో లేదో చూడాలి.

గత బడ్జెట్ సమయంలో కేంద్రం రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.10,000 కోట్లను అందిస్తామని పేర్కొంది. అయితే ఇందులో ఒక మెలిక పెడుతూ దీనిని ఫైనాన్స్ రూపంలో ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించిన సంగతి తెలిసిందే.
వాస్తవానికి బడ్జెట్ ప్రసంగానికి కొన్ని వారాల ముందు ఇటీవలే ఏపీలో దాదాపు రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఇది ఆంధ్రప్రదేశ్ పట్ల మోదీకి ఉన్న నిబద్ధతను చూపుతున్నప్పటికీ.. బడ్జెట్లో కేటాయింపులు తగ్గించేందుకు కొన్ని ముందస్తు తాయిలాలను మోదీ సర్కార్ ఏపీకి అందించిందా అనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. మెుత్తానికి బడ్జెట్ సమీపిస్తున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికల్లో ఆంధ్రా ప్రాధాన్యత కనిపించేలా ఏపీ చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.