వేసవిలో వరుణ ప్రభావం: అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో హాహాకారం
మండుతున్న ఎండల మద్య అకస్మాత్తుగా కురుస్తున్న అకాల వర్షాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్లోనూ వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించాడు. మారు మోగినట్లుగా వచ్చిన ఈదురుగాలులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు నగరాలను, గ్రామాలను అతలాకుతలం చేస్తున్నాయి. హైదరాబాద్లో రహదారులు నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి, హోర్డింగులు విరిగిపడ్డాయి. ఇటు ఉప్పల్లోనూ పెద్ద ప్రమాదమే తప్పింది. భారీ ఫ్లెక్సీ తెగి రోడ్డుమీద ఆడుకుంటున్న పిల్లల మీదకొచ్చింది. వెంటనే వాళ్లు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు.
గ్రామీణ తెలంగాణలో వర్ష బీభత్సం
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్, సిరిసిల్లా, యాదాద్రి, కామారెడ్డి, నిర్మల్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్నిచోట్ల వడగండ్ల వానలు చోటు చేసుకోగా, పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మార్కెట్ యార్డుల్లో నిల్వ ఉన్న ధాన్యం పూర్తిగా తడిసి నష్టపోయింది. మామిడి తోటలు వర్షాలకు నేలరాలాయి. మెట్పల్లిలో వందలాది ఎకరాల్లో మామిడి తోటలు దెబ్బతిన్నాయి. అలాగే కామారెడ్డి జిల్లా గూడెం గ్రామంలో పిడుగు పడి 40 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
ఏపీ రైతులను గట్టిగా తాకిన వర్ష ప్రభావం
ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ వర్షాలు బీభత్సం సృష్టించాయి. అనంతపురం, కడప, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాల్లో వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. విడపనకల్లు మండలంలో ఇళ్లపై కప్పులు ఊడిపోవడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. వేంపల్లిలో ఉరుములతో కూడిన వర్షం జనాన్ని బెంబేలెత్తించింది. పాడేరు మండలంలో భారీ వర్షానికి పంట నష్టం తీరలేని నష్టాన్ని మిగిల్చింది. శ్రీకాకుళంలో పలు చెట్లు నేలకొరిగి, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రైతన్నలు ఖర్చుపెట్టిన పెట్టుబడులు, ఆశలు అన్నీ ఒక్క వానలో కొట్టుకుపోయాయి. మామిడి తోటలు నేలకొరిగాయి, ధాన్యపు గింజలు తడవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
మరో ఐదు రోజుల వర్ష సూచన: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి వంటి జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరిక. పలు చోట్ల వడగండ్ల వానలు కూడా పడే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే వర్షాలు వచ్చినా ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు తప్పనిసరిగా రక్షణ చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
READ ALSO: Rain : హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం..ఎక్కడిక్కడే ట్రాఫిక్ జాం