Nadendla Manohar : ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో విజయవాడలోని పాత బస్టాండ్ కూడలి వద్ద నిర్వహించిన మానవహారంలో మాజీ మంత్రి సామినేని ఉదయభానుతో కలిసి ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్లో అమాయకులైన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టామని మనోహర్ చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు తామంతా అండగా ఉంటామన్నారు.

భారత పౌరులంతా ప్రధాని మోడీకి అండగా నిలవాలి
ఈ సమయంలో భారత పౌరులంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అండగా నిలవాలన్నారు. జనసేన పక్షాన కొవ్వొత్తుల ర్యాలీ, మౌన దీక్షలు, ఇవాళ మానవహారం నిర్వహించామని మనోహర్ వెల్లడించారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు, కుల, మతాలు చూడవద్దని, భారతీయులుగా మనవాళ్లకు అండగా నిలవాలని చెప్పారు. బాధిత కుటుంబాలకు జనసేన పక్షాన కూడా సాయం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఎంతటి బాధ ఉన్నా ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కావలిలో జనసేన నేత మధుసూదన రావు భౌతికకాయాన్ని చూసి పవన్ కల్యాణ్ చలించిపోయారని నాదెండ్ల పేర్కొన్నారు. జరిగిన దుర్ఘటన గురించి ఆయన భార్య చెబుతుంటే కన్నీరు ఆగలేదన్నారు.
Read Also: ప్రభుత్వ లాంఛనాలతో విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి