జనసేన పార్టీ స్థాపన వెనుక ఉన్న అసలైన కారణాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వెల్లడించారు. 2014లో పార్టీని ఏర్పాటు చేసినప్పటికీ, రాజకీయాల్లో పూర్తిస్థాయిలో ప్రజాసమస్యలపై పోరాడటానికి 2019 ఎన్నికల నాటికే పూర్తిగా సిద్ధమయ్యామని చెప్పారు. ఓటమి భయం లేకుండా 2019లో పోటీ చేసి, గెలుపోటములను పట్టించుకోకుండా ముందుకు సాగామని అన్నారు. ప్రజాసమస్యలు తీర్చడానికి మనం వెనుకడుగు వేయలేదని, పార్టీని నిలబెట్టుకోవడంతో పాటు, తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టామని తెలిపారు.

వైసీపీ కుట్రలు – అడ్డుకట్ట వేసిన జనసేన
2019లో తమ పార్టీ ఓడిపోతే వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారని, జనసేనను చిన్నచూపు చూడాలని ప్రయత్నించారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం తనపై పలు కుట్రలు పన్నిందని, చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడిని జైల్లో పెట్టి అవమానించారని తెలిపారు. అసెంబ్లీ గేటును కూడా తాకలేమని వైసీపీ నేతలు చరిచినా, చివరికి వారికే గట్టి ఎదురు దెబ్బ తగిలిందని పేర్కొన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏపీలో స్థాపించగలిగిందని అన్నారు.
తెలంగాణతో జనసేన అనుబంధం
తెలంగాణ రాష్ట్ర ప్రజలపై తనకు ప్రత్యేకమైన అభిమానముందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కొండగట్టు అంజన్న దీవెనలతో తన ప్రాణాలు నిలిచాయని, తెలంగాణ ప్రజల ఆశీస్సులతోనే తిరిగి ప్రజా పోరాటంలో నిలబడగలిగానని చెప్పారు. ప్రముఖ ప్రజాకవి గద్దర్ పాటను గుర్తుచేసుకుంటూ, “నా అన్న గదరన్నకు వందనం” అంటూ గద్దర్కు నివాళి అర్పించారు. తెలంగాణ నుంచి వచ్చిన జనసేన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, జనసేనకు తెలంగాణ జన్మభూమి, ఆంధ్రప్రదేశ్ కర్మభూమి అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.