భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

అల్పపీడన ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షం భద్రాద్రి జిల్లాను వదలడం లేదు. ముసురుతోపాటు కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు పడుతుండడంతో చెరువులు, వాగులు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనికితోడు ఎగువనున్న ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా నుంచి వస్తున్న వరదతో తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరగా.. భద్రాచలం వద్ద గోదావరి క్రమేపీ పెరుగుతున్నది.

మంగళవారం ఉ.6 గంటలకు గోదారి నీటిమట్టం 41.6 అడుగులకు చేరుకుందని చెప్పారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు వివిధ ప్రాజెక్టుల నుంచి అవుట్ ఫ్లో భారీగా వస్తుండడంతో నీటిమట్టం పెరుగుతుందన్నారు. మరో అడుగున్నర గోదారి నీటిమట్టం పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.

ఇటు వరదలతో అతలాకుతలమైన విజయవాడ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వారం రోజులుగా అటు వరదలు, ఇటు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరైన నగరవాసులు బయటకు వస్తున్నారు. నిన్న వర్షం కురవకపోవడంతో సహాయక చర్యలూ వేగంగా సాగాయి. వ్యాధులపై ఇంటింటి సర్వే నిర్వహించారు. మరోవైపు ధ్వంసమైన ప్రకాశం బ్యారేజీ గేట్ల స్థానంలో కొత్తవాటిని బిగించింది. ఇందుకోసం కన్నయ్య నాయుడిని రంగంలోకి దించింది.