విజయనగరం జిల్లాకు చెందిన రఘు ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థిని టీచర్ పై చెప్పుతో దాడి చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కాలేజీలో ఈసీఈ రెండో సంవత్సరం చదువుతోన్న ఓ విద్యార్థిని, తరగతి సమయంలో సెల్ఫోన్లో మాట్లాడడం వల్ల క్లాస్లోని పక్కవారికి తీవ్ర ఇబ్బంది కలిగించింది. దీనితో మహిళా లెక్చరర్ వెళ్లి విద్యార్థిని వద్ద ఉన్న ఫోన్ను బలవంతంగా తీసుకుంది. దీంతో విద్యార్థిని పట్టరాని కోపంతో నా సెల్ ఫోన్ ఇవ్వకపోతే చెప్పుతో కొడతాను. అంటూ దుర్భాషలాడి, చెప్పుతో కొట్టి మరీ లెక్చరర్ పై దాడికి దిగడం అమానుషంగా కనిపించింది.
ఈ ఘటనలో విద్యార్థిని ప్రవర్తన విద్యార్థి సమాజం నైతిక విలువలు ఎంతగా దిగజారిపోయాయన్న సందేహాన్ని కలిగిస్తోంది. గురువు లాంటి లెక్చరర్కి గౌరవం చూపాల్సిన స్థాయిలో ఉండాల్సిన విద్యార్థులు, ఇప్పుడు వారిని దూషించే స్థితికి చేరడం బాధాకరం. అయితే సెల్ ఫోన్ తీసుకున్న లెక్చరర్ పై పట్టరాని కోపంతో నా సెల్ ఫోన్ నాకు ఇస్తావా లేదా? సెల్ ఫోన్ ఖరీదు పన్నెండు వేలు, నా ఫోన్ నువ్వు ఎందుకు తీసుకుంటున్నావ్? నా సెల్ ఫోన్ నాకు ఇవ్వకపోతే చెప్పుతో కొడతాను అంటూ దుర్భాషలాడుతూ మెరుపు వేగంతో లెక్చరర్ వద్దకు వెళ్లింది. దుర్భాషలతో ఆగకుండా చెప్పు తీసుకొని లెక్చరర్ ను కొట్టడం ప్రారంభించింది. విద్యార్థిని తనను చెప్పుతో కొట్టడం ఏంటి అని నిర్ఘాంతపోయిన లెక్చరర్ ఆ విద్యార్థిని వారించే ప్రయత్నం చేసింది.
వీడియో వైరల్
ఈ ఘటనను అక్కడే ఉన్న విద్యార్థుల్లో ఒకరు తన మొబైల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, వీడియో కాస్తా క్షణాల్లో వైరల్ అయిపోయింది. విద్యార్థిని చర్యలపై సాక్ష్యాధారాలు సేకరించిన కమిటీ, ఆమె వ్యవహారం పూర్తిగా విచక్షణ కోల్పోయినదని తేల్చి, అక్రమంగా లెక్చరర్పై దాడికి దిగిందని నివేదికలో పేర్కొంది. దీనిపై ఆధారంగా, కాలేజీ యాజమాన్యం విద్యార్థినిపై సస్పెన్షన్ విధిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కళాశాల యాజమాన్యం తీసుకున్న చర్యలపై విద్యార్థిని ఇప్పటివరకు ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. ఆమె ఈ నిర్ణయాన్ని ఎలా స్వీకరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Read also: Pakistanis : పాకిస్థానీలు రేపటిలోగా వెళ్లిపోవాలి – ఏపీ డీజీపీ