విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు కొత్త దశలోకి – ప్రాజెక్ట్ను వేగవంతం చేస్తున్న ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో కీలక ప్రాజెక్టులలో ఒకటైన విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టు మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. రాష్ట్ర ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ప్రజా రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ మెట్రో ప్రాజెక్టును ప్రభుత్వం ప్రాధాన్యతతో తీసుకుని వేగంగా ముందుకు తీసుకెళుతోంది. ఇప్పటికే నగరాన్ని మూడు కారిడార్లుగా విభజించి మెట్రో నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు ఈ ప్రాజెక్టును అమలు చేయడంలో మరో అడుగు పడింది.
కన్సల్టెన్సీ ఎంపిక కోసం టెండర్ల ప్రక్రియ ప్రారంభం
ఈ రోజు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక ప్రకటన చేస్తూ మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ, నిర్మాణాన్ని పూర్తిచేయడం వంటి దశలకోసం కన్సల్టెన్సీ సేవలకై టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండర్లకు సంబంధించి నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశంలో దేశీయ, అంతర్జాతీయంగా 28 ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థలు పాల్గొనడం ప్రాజెక్టుపై ఉన్న ఆసక్తిని స్పష్టం చేస్తోంది. ఈ సమావేశానికి 14 సంస్థల ప్రతినిధులు ప్రత్యక్షంగా హాజరుకాగా, మరో 8 సంస్థల ప్రతినిధులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. టెండర్లను దాఖలు చేయడానికి జూన్ 8వ తేదీ వరకూ గడువు విధించగా, జూన్ 9న టెండర్లు ఓపెన్ చేసి కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నట్లు ప్రకటించారు.
ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మద్దతు – మూడు కారిడార్లలో ప్రథమ దశ
ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిగి, 100 శాతం గ్రాంట్ లభించనున్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం రూ. 11,498 కోట్ల వ్యయంతో నిర్మించనున్న విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశలో మూడు కారిడార్లుగా నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో మొత్తం 46.23 కిలోమీటర్ల పొడవుతో 42 మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇది పూర్తైతే విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గి, ప్రయాణీకులకు వేగవంతమైన, సురక్షితమైన ప్రజా రవాణా మార్గం సిద్ధమవుతుంది.
భవిష్యత్తులో నాల్గవ కారిడార్ – భోగాపురం వరకు విస్తరణ
ప్రాజెక్టు రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు నాల్గవ కారిడార్గా మరో 8 కిలోమీటర్లు మెట్రో మార్గాన్ని విస్తరించనున్నారు. ఇది భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయంగా చెప్పొచ్చు. విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీ అందించడం వల్ల విదేశీ ప్రయాణికులే కాకుండా, వ్యాపార వర్గాలకు కూడా ఇది అనుకూలంగా మారనుంది.
మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టును వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ప్రకటించింది. కన్సల్టెన్సీ ఎంపిక పూర్తయిన వెంటనే నిర్మాణ పనులకు బాట వేయనున్నారు. ప్రాజెక్టు ప్రారంభమైన తరువాత, పనులు నిరంతరాయంగా సాగేలా అన్ని విభాగాల మధ్య సమన్వయం ఉంచుతూ ప్రభుత్వం ముందుకెళ్లే యోచనలో ఉంది.
read also: Sujana Chowdary: లండన్లో ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్రగాయం